12 February 2011

ఘంటసాల ముచ్చట్లు



ఈ రోజు ఫిబ్రవరి 11. అమరగాయకుడు ఘంటసాల వేంకటేశ్వరరావుగారి వర్థంతి. డిసెంబరు 4 ఘంటసాల గారి పుట్టినరోజు. 


ఘంటసాలగారి జయంతి నే కాక వర్థంతిని కూడా ఒక ఉత్సవంలాగ నిర్వహించి సంబరపడుతూ ఉంటారు ఘంటసాల అభిమానులు.ఆయన మనకు మిగిల్చి వెళ్ళిన పాటలను,  పద్యాలను పదే పదే పాడుకుంటారు. ఘంటసాలగారి గురించి ఎక్కడ కార్యక్రమం జరిగినా వివరాలు తెలుసుకోవడానికి ఆసక్తి ప్రదర్శిస్తారు. ఘంటసాలగారి బొమ్మ చూపిస్తూ ఏ విశేషాలు చెప్పినా మరల మరల వింటారు. నిజానికి 1974 లో ఆయన ఇహలోకాన్ని విడిచి పెట్టి వెళ్ళి 37 సంవత్సరాలు గడిచినా,  ఆనాటికి ఇంకా కళ్ళు తెరవని పసి కూనలు కూడా ఆయన పాడిన పాటలని  తమ ముందుతరం ఎంత పరవశంతో విన్నదో అంతే పారవశ్యంతో వింటూ వాటిని ఆనందించగలగడమే  ఘంటసాల అమరత్వాన్ని ఋజువు చేస్తోందన్నమాట.


ఆనాడు ఘంటసాలగారి వాద్యబృందంలో ఒకరిగా ఉంటూ హార్మోనియంపై సహకారం అందిస్తూ, ఘంటసాలగారు విజయనగరంలో  సీతారామ శాస్త్రిగారి దగ్గర సంగీతం నేర్చుకుంటున్నప్పటి  విద్యార్థి దశనుంచి కొంత కాలం విరామంతో ఘంటసాలగారు  స్వర్గస్థులయ్యే వరకు వారి సంగీత సాహచర్యంలో వెన్నంటి ఉన్నారు శ్రీ సంగీత రావుగారు.


సంగీతరావుగారు గురువుగారు సీతారామశాస్త్రిగారి  పెద్దకుమారులు. గురుపుత్రుడుగా సంగీతరావుగారిని ఎంతో ప్రేమాభిమానాలతో గౌరవంతో చూసేవారు ఘంటసాల. సంగీతరావుగారిని సంగీతం బాబూ అని పిలిచేవారట ఘంటసాల.


 గాయకుడిగా ఘంటసాల గారి  వృత్తిజీవితంతో పాటు చిరపరిచయం వలన వ్యక్తిజీవితం కూడా తెలిసిన వారు సంగీతరావుగారు. 


నిజానికి ఘంటసాల సంగీతం గురించి, రాగ ప్రయోగాలలోని విశిష్టతను, విలక్షణతను  గురించి  అధికారంతో  చెప్పగల   ఒకే ఒక వ్యక్తి ఎవరైనా ఉంటే వారు  సంగీతరావుగారు. 


ఘంటసాల సంగీతం గురించే కాదు, ఆయన గురించి ఎన్ని విశేషాలు చెప్పినా సంతోషంగా చెవిఒగ్గి వినే అభిమానుల కోసం, ఘంటసాలగారి మిత్రుడు సంగీతరావుగారు విజయచిత్రలో ఒకప్పుడు రాసిన వ్యాసం ఇక్కడ మరోసారి ప్రచురిస్తున్నాను.




ఇవి ఘంటసాలగారి  గురించి సంగీతరావుగారు చెప్పిన  ముచ్చట్లు. చిత్తగించండి.....
.


సంగీతరావుగారు



ప్రజల గాయకుడు శ్రీ ఘంటసాల పుట్టిన రోజు డిసెంబరు 4. ఫిబ్రవరి 11 వ తేదీని ఆయన వర్థంతిగా శ్రీ ఘంటసాల జయంతి ఉత్సవాలు, వర్థంతి ఉత్సవాలు ఆంధ్ర దేశంలోను, ప్రవాసాంధ్రంలోనూ చాలా చోట్ల ఆయన అభిమానులు జరుపుకుంటున్నారు. ఒక గాయకునిగా ప్రజాభిమానాన్ని ఇంతగా పొందడం అపూర్వమైన విషయం. అయితే ఒకటి నిజం. తెలుగు ప్రజలు తమ సంగీత దాహం శ్రీ ఘంటసాల గానామృతంతోనే సంపూర్ణంగా తీర్చుకున్నారన్నది సహజోక్తి. నిజానికి గాయకునిగా శ్రీ ఘంటసాల గొప్పదనాన్ని ఎవరూ  పని కట్టుకొని విశదీకరించనవసరం లేదు. తెలుగు ప్రజలందరికీ అనుభవైకవేద్యమైనది ఆయన పాట.

గాయకునిగా ఇంతటి విజయం పొందడానికి కారణాలు చెప్పుకోవాలంటే ముఖ్యంగా ఆయన కంఠస్వరం. శ్రీ చిత్తూరు నాగయ్యగారు చెప్పినట్టు శ్రీ ఘంటసాల కంఠంలో తంబూరా నాదంలో ఉన్న జీవస్వరం ఉంది. ఏస్థాయిలో పాడినా ఒకే విధమైన నిండుతనం. గాత్రంలో కాని, ఉచ్చారణలో కాని ఏ విధమైన కృత్రిమత్వం లేదు. వాటికి తోడు రసస్ఫూర్తిగా గానం చేసే  ప్రతిభ. మరోసంగతి, ఒక నాయకుడు గాని, ఒక గాయకుడు గాని, కవిగాని ప్రజా జీవితంలో ఒక భాగంగా గుర్తించచబడితే నాటి పరిస్థితుల ప్రభావం కూడా ఉందన్నమాట.
శ్రీ ఘంటసాల దేశానికి పరిచయమయే నాటికి సంగీత రసికుల పరిస్థితి ఏమిటి. ఒక వంక ఒక మహోద్యమంలా శాస్త్రీయ సంగీత సాధన జరుగుతూ ఉంది. మనవారు పొరుగు రాష్ట్రానికి వెళ్ళి వాళ్ల బాణీలో శ్రీ త్యాగరాజస్వామి కృతులు గానం చేసే విద్వాంసుల గానాన్ని ఆనందించగలిగే రసజ్ఞత అలవర్చుకుంటున్న సమయం. ఆ సంగీతం పట్ల ఎంతో  భక్తి ప్రపత్తులు కలిగినా ఉచ్చారణలో ఉన్న అసహజత్వం వల్ల ఆయా రచనలు తెలుగు భాషలో ఉన్నా అవి మనవి అన్న మమకారం కలిగించలేదు.

అదే విధంగా ఆనాడు స్టేజి సంగీతం విపరీతమైన జనాదరణ పొందుతున్న రోజులు. మైలవరం నాటక సంగీతం వెనకపడి, బాల గంధర్వ, మాస్టర్ కృష్ణారావు, నారాయణరావు వ్యాస్ మొదలైన మహారాష్ట్ర గాయకులు పాడిన పాటల ఒరవడి తెలుగు స్టేజి సంగీతాన్ని ఆక్రమించుకొంది. శ్రీ సి.ఎస్.ఆర్., శ్రీ రఘురామయ్య, శ్రీ తుంగల చలపతిరావు, శ్రీ కపిలవాయి రామనాథ శాస్త్రి ఇత్యాదులు అందరూ మహారాష్ట్ర సంగీత ప్రభావంతో గానం చేసినవారే. తెలుగు సంగీత రసికులు ఆ గానంతో కూడా తన్మయత్వం చెందేరు. నిజమే. కాని ఆ పాట కూడా తెలుగు పాట అనిపించలేదు. తెలుగు సినిమా, పౌరాణిక చిత్రాల యుగం వరకూ తెలుగు చలన చిత్ర సంగీత పరిస్థితి కూడా ఇదే.

ఈ పరిస్థితిలో సినిమా తెర వెనుక కంఠం నుంచి వినిపించింది -తరాలుగా ఎదురు చూసిన  తెలుగు పాట. నవరసభరితమైన పాట, గుండెలు కదిలించిన పాట. అదే ఘంటసాల పాట. తెలుగువాడు నాదీ అని గర్వంగా చెప్పుకోగలిగిన పాట అది. కష్టంలోను, సుఖం లోను, ప్రతి అవస్థలోనూ సానుభూతితో పలకరించే ఆ పాట అవిచ్ఛిన్నంగా మూడు దశాబ్దాలు వినిపించింది. అంతే కాదు తెలుగు సినిమా సంగీతంలో ఒక నవ్య శకమే స్థాపించింది. దక్షిణదేశం అంతా నేపథ్యగానానికి ఘంటసాల పాటే ఒరవడి అయింది.

ఈ నాడు ఘంటసాల ఒక వ్యక్తి కాదు, ఒక సంస్థ.

గాయకునిగా మాత్రమే కాదు, వ్యక్తిగా కూడా శ్రీ ఘంటసాల స్మరణీయుడు. తాను మనసారా నవ్వి, ఇతరుల చేత కూడా నవ్వింపజేసే మధుర హృదయం ఆయనది. వృత్తి ధర్మంగాను, స్నేహ ధర్మంగానూ  ఆయనతో కలిసిమెలిసి జీవితం పంచుకున్నవారు చెప్పుకొనే మధుర స్మృతులు ఎన్నో. ఏదైనా పాట కంపోజింగ్ లో కాని, పాట రిహార్సల్స్ లో గాని, దర్శకులు, కవులూ, వాద్య బృందం అందరితో శ్రీ ఘంటసాల కూడా ఉన్నారంటే అదో మధురమైన అనుభవంగా ఉండేది. జరగవలసిన పని మందకొడిగా ఉంటే హుషారు కోసం ఎన్ని ముచ్చటలో చెప్పేవారు. ఎన్ని పాటలో పాడేవారు.

ఘంటసాలగారు స్వర రచన చేసేటప్పుడు ఎందరో సినీ కవులతో కలిసి పనిచేసారు.  రచనలో మన కవులందరిదీ 
ఒక్కొక్కరిదీ ఒక్కొక్క పద్ధతి.

శ్రీ సముద్రాల సీనియర్ - ఏదైనా పాట రాయవలసి వస్తే ఇటు దర్శకుడు, సహాయ దర్శకుడు, నిర్మాత ఆఖరికి ప్రొడక్షన్ డిపార్ట్ మెంట్ తో కూడా సంప్రదించి పాట ఎలా ఉండాలనుకుంటున్నారో తెలుసుకొని రికార్డింగ్ ఎప్పుడు పెట్టుకుంటున్నారో తెలుసుకొని చివరికి సంగీత దర్శకుడితో - ఏది బాబూ ట్యూన్ ఒకమారు అనండి అని అడిగి తనన తనన తన అది కదూ. తా తనన తన అనుకోవచ్చును కదా అని
అక్కరలేని సందేహం తీర్చుకొని ఒక లైన్ పల్లవి రాసి ఇచ్చి అంతా రాసేసి ఉంది తలకాయలో. కాగితం మీద పెట్టడమే తరువాయి అని మరో సంస్థకు వెళ్ళేవారు.

ఇక కొసరాజు గారు - పాట అంతా పూర్తిగా రాసి వచ్చేవారు. వారు రాసి, పాట ఆయనే వినిపించేవారు. సంగీత దర్శకులు కూడా ఆయన పాడిన ట్యూనే తీసుకునే వారు. కారణం, ఆ తరహా పాటలకి అదే సరి అయిన ట్యూను.

శ్రీ కృష్ణశాస్త్రిగారు పాట రాయడానికి కూర్చుంటే సంగీత దర్శకులు అలా పాడుతూ కూర్చోవలసిందే. ఆయన కళ్ళు పెద్దవి చేసుకొని చిరునవ్వుతో అలా వింటూ ఉండేవారు. ఒక్క అక్షరం కూడా రాసేవారు కాదు. ఒకసారి, ఒక పాట రాస్తున్న సందర్భంలో ఘంటసాల ట్యూన్  వినిపిస్తూనే ఉన్నారు. తానా తననా తనన తాన తాన అంటూ పాడుతున్నారు. ఎప్పటికీ  శాస్త్రిగారు ఒక మాట కూడా ఇవ్వలేదు. అందరికీ విసుగు వచ్చిందని తెలుసుకొని శాస్త్రిగారు కాగితం మీద రాసేరు ఒక లైను. ఓసీ పిశాచీ కదలిరావే బూచీ .....ఇదే కదా మీ పాట కొలతలు అని.


శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రిగారయితే ఇలాంటి అబద్ధపు సాహిత్యం మంచి రక్తి అయిన భాషలో రాస్తుండేవారు నవ్వుకొనేందుకు.

శ్రీ ఘంటసాలకు స్వయంగా పాటలు రాసుకొనే ధోరణి కూడా ఉండేది.

బహు జనాదరణ పొందిన బహుదూరపు బాటసారి ఆయన స్వీయ రచనే. ఆ పాట లోని మార్మిక కవిత్వం గురించి వివరణ అడిగితే ఇలా చెప్పేరు. ఆయన మద్రాసు వచ్చిన తొలి రోజుల్లో శోభనాచల స్టూడియోలో కాలక్షేపం చేస్తున్న రోజుల్లో అర్ధరాత్రి పెట్రోమాక్స్ లైట్లతో ఒక శవాన్ని ఊరేగింపులా శ్మశానానికి తీసుకొని వెళ్తున్న దృశ్యమే ఆ పాట రచనకి ప్రేరణ అని చెప్పారు.

చివరి దశలో ఇది సంధ్యా సమయం అనే స్వీయ రచన రేడియోలో పాడిన జ్ఞాపకం.

సంగీతంలో సంప్రదాయం అంటే శాస్త్రీయ సంప్రదాయం మాత్రమే కాదు. శాస్త్రజ్ఞులు అంగీకరించిన దేశి సంప్రదాయం కూడా ఉంది. భజన కీర్తనలు, ఊడుపుల పాటలు, నూర్పుల పాటలు, దంపుళ్ళ పాటలు, స్త్రీల పాటలు, జోల పాటలు అనేక రకాలు. ఇవన్నీ దేశి సంప్రదాయమే.

శ్రీ ఘంటసాలకి శాస్త్రీయ సంగీతం మీద ఉన్నంత ప్రేమ, గౌరవం ఈ దేశి సంప్రదాయం మీద కూడా ఉండేది. ఒకసారి ఎవరో అడిగేరు. మీరు ఇంత ఆవేశంతో ఎలా పాడగలుగుతున్నారని. దానికి బుర్రకథా శ్రవణం వంటి వాటి ప్రభావం కారణం అని చెప్పేరు.

సంగీత దర్శకత్వంలో ఆయనకి దేశి సంప్రదాయం ఎంతో అవసరం అయేది.
ఒకసారి వినాయక చవితి చిత్రానికి సంగీతం నిర్వహిస్తున్న రోజులు. ఆ చిత్రంలో పార్వతీ దేవికి నలుగు పెట్టే సందర్భంలో పాట కావలసి వచ్చింది. ఆయన ఏదో చేయగలరు. కానీ సాధ్యమైనంత వరకు సంప్రదాయం పాటిస్తే ఉచితంగా ఉంటుంది. ఇంటికి రాగానే ఒరే రాజీ అని పిలిచేరు.(భార్య శ్రీమతి సావిత్రమ్మగారిని ఆయన పిలిచే పద్ధతి అది. ఏదైనా నలుగు పాట వస్తే పాడరా అని అడిగేరు. ఈ రకమైన పాటల పరిచయం ఉంది ఆవిడకు. ఆవిడ ఇచ్చిన పాట వరసే తర్వాత వచ్చింది సినిమాలో పార్వతీ దేవి పరంగా.

శంకరాభరణం స్వరాలు తిశ్రం.
ససగ గగమ మప పప పమ
నలుగిడరె, నలుగిడరె
గమ పదనిరి సనిదపా
నలుగిడరా......రే
సససససని గరి సనిదప
చెలువుగ శ్రీ గౌరి కిపుడు
సనిదప గమపగ మరిగస
నలుగిడరా.........రే
(పల్లవి మాత్రం)

హిందుస్తానీ, కర్ణాటక సంగీతం అన్నా విద్వాంసులన్నా ఎంతో గౌరవం, ప్రేమ ఉండేవి ఆయనకి. 1950-60 ల మధ్య శ్రీ ఉస్తాద్ బడే గులాం ఆలీఖాన్ రెండు మూడు సార్లు మద్రాసులో మకాం పెట్టేరు. రెండు, మూడేసి మాసాలు ఘంటసాల గారింట్లోనే. 

ఆ రోజుల్లో ఘంటసాలగారి స్వగృహం 35, ఉస్మాన్ రోడ్ (ప్రస్తుతం 151) మద్రాసు లోని శాస్త్రీయ సంగీతాభిమానులకు యాత్రా స్థలం అయింది. శ్రీ ఘంటసాల గాత్రం విని శ్రీ బడే గులాం ఆలీ ఖాన్ ముగ్థులై రెండు మూడు భజన్ లు కూడా చెప్పేరు.

ఘంటసాల మద్రాస్ వచ్చిన మొదటి రోజుల్లో మ్యూజిక్ అకాడెమీ లో నిస్సార్ హుస్సేన్ ఖాన్ కచేరీకి శ్రీ ఘంటసాల సంతోషంగా, అదీ ఒక గౌరవంగా భావించి తంబూరా శ్రుతి వేసేరు.

శ్రీ ఘంటసాల ఒక విధమైన ఆదర్శ జీవి. దేశ సేవకి సంగీతజ్ఞుడిగా, గాయకునిగా వినియోగపడాలని ఆశించేవారు. కాలక్షేపం కబుర్లు చెప్పుకొనేటప్పుడు తప్పకుండా ఆయన 1942 ఆగష్టు ఉద్యమంలో పాల్గొన్నప్పటి జైలు జీవిత విశేషాలు చెబుతూ ఉండేవారు. ఈనాటి దేశ నాయకులు చాలామంది శ్రీ ఘంటసాల జైలు మిత్రులు.

రసజ్ఞత లేని శ్రోతల సమక్షంలో పాడవలసి వచ్చినప్పుడు    గురువుగారు పట్రాయని సీతారామ శాస్త్రిగారు ఎంతో నిర్వేదంతో  చెప్పిన పద్యం ఒకటి ఉండేది.
............................................
లోక మోహన కర గాన విద్యనకటా
వికటంబుల పాలు చేసి జీవనమును బుత్తువా
దురిత భారము నెత్తిన మోసి మూర్ఖుడా –అని.

 సంగీత దర్శకత్వంలో ట్యూను విషయంలో దర్శకులు నిర్బంధం ఒక్కొక్కప్పుడు  తప్పనప్పుడు, ఘంటసాల గారు ఈ పద్యం పాడుకునేవారు.

  
ఎంతో గాఢమూ, ఆవేశ పూరితమూ, నిర్విరామమూ అయిన ఆయన జీవిత విధానానికి ఆయన శరీరం తట్టుకోలేకపోయింది. మొదటినుంచీ ఆయనది అస్వస్థత కలిగిన శరీరమే. శరీరం ఏదో భాగానికి ఎప్పుడూ చికిత్స అవసరమే. ఒక్క కంఠం తప్పించి ఆయన శరీరం ఆయనకి సహకరించలేదు. వంశపరంపరగా వచ్చిన మధుమేహ వ్యాధికి చికిత్స సంపూర్ణమైన సత్ఫలితాన్ని ఇచ్చేది కాదు. వైద్యం విషయంలో ఆయన వట్టి అమాయకుడు. మధుమేహానికి నియమ నిబద్ధమైన ఆహార విహారాలు అవసరం అన్న మాట మీద ఆయనకు నమ్మకం ఉండేది కాదు. ఎవరు ఏ చిట్కా వైద్యం చెప్పితే అది వెంటనే అమలులో పెట్టేవారు.

నిజానికి శ్రీ ఘంటసాల జీవిత విశేషాలు రాయాలంటే ఒక ప్రత్యేక గ్రంధమే రాయాలి.

 శ్రీ ఘంటసాల మనలను విడిచి పదహారు సంవత్సరాలు అయిందని  అనుకుంటున్నాం. కాని ఆయన, మన ముందు తరాలలో కూడా ఆంధ్ర ప్రజలను విడిచి ఉండరు. నిరంతరం ఆయన గానం దేశం అంతటా ప్రతిధ్వనిస్తూనే ఉంది.

ఈ పదహారేళ్ళలో సినిమా సంగీతంలో అనేక పరిణామాలు వచ్చేయి. రికార్డింగ్ లో అనేక సాంకేతిక సౌకర్యాలు ఏర్పడ్డాయి. వాద్య సంగీతంలో చెప్పుకోదగిన పరిణామం వచ్చింది. సంగీత నిర్వహణలో నేపథ్య సంగీతానికి ఎరేంజర్స్ ఏర్పడ్డారు. సినిమా సంగీతజ్ఞులు ఆర్థికంగా బాగుపడ్డారు పూర్వంకన్నా.

అయితే ఒకటి ప్రజలకి ఇంకా పాత పాటలమీద మోజు తీరనే లేదు.
ఈనాడు సంగీతాభిమానులైన ఏ యువకుడు పాట పాడినా, పద్యం చదివినా అది ఘంటసాల ఏర్పర్చిన సంగీతపు నుడికారంతోనే ఉంటుంది. ఆయన సజీవులుగా ఉన్న రోజుల్లోనే ప్రతి ఊళ్ళోను ఒక జూనియర్ ఘంటసాల ఏర్పడ్డాడు. దేశం అంతటా శ్రీ ఘంటసాల ఏకలవ్య శిష్యులే. అందుకే శ్రీ ఘంటసాల అద్యతనాంధ్ర లలిత సంగీత సంప్రదాయ నిర్మాత. ఆయన సంగీతం శ్రీ త్యాగరాజ స్వామి నిర్వచించిన సారూప్య సాధనమైన నాదోపాసన కాదు. నవరస భరితమైన హృదయం సంవేదన.
సంగీత రసిక లోకం ఆ మహానుభావునికి జోహారుల్పిస్తోంది.


సంగీతరావుగారు ఈ వ్యాసం రాసి ఇప్పటికి ఇరవై సంవత్సారాలు గడిచింది. ఆనాడు ఘంటసాల గానం దేశమంతా ప్రతిధ్వనిస్తూనే ఉంది  అన్న మాట ఇంకా నిత్యనూతనమైన సత్యంగా నిలిచిపోయింది. ఎందరో జూనియర్ ఘంటసాలలు ఏర్పడ్డారు, ఏర్పడుతూనే ఉన్నారు. 
అందుకే తెలుగువాళ్ళకి  ఒక త్యాగయ్య, ఒక అన్నమయ్య, ఒకే ఒక ఘంటసాల. 


02 February 2011

బూచాడమ్మా బూచాడు... బుల్లి పెట్టెలో ఉన్నాడు !!


భగవంతుడా,
         మా దగ్గరున్నవన్నీ తీసేసుకో,
         ధనం, ధాన్యం,
        ఇల్లు, పొలం,
        రాజ్యం, అధికారం,
        అన్నీఅన్నీ
        తీసేసుకో,
        మా బాల్యం మాత్రం మా  కిచ్చెయ్........
ఈ మధ్య ఒక బ్లాగులో చూసాను ఈ కవిత. 
బాల్యం అనే అనుభవానికి ఉన్న పవర్ అది.  పెద్దవాళ్ళయిపోయిన తర్వాత వెనక్కి  తిరిగి గత జీవితాన్ని తలపోసుకుంటే మధురాతి మధురమయిన స్మృతులన్నీ బాల్యానికి చెందినవే ఉంటాయి ఎక్కువగా. ఆ బాల్యంలో అనుభవించినవి ఆ సమయానికి కష్టాలు గా అనిపించినా ఇప్పుడు  తలచుకుంటున్నప్పుడు అవన్నీ  ముచ్చటలుగా మురిపిస్తాయి. 
మారిన సామాజిక పరిస్థితులలో పిల్లల బాల్య జీవితం ఇదివరకటి కన్నా సంక్లిష్టంగా తయారయింది. చదువులు, పరీక్షలు, అన్నిటిలో పోటీ తత్వం  పెరిగిపోయింది. తగినంత ప్రోత్సాహం లేకపోతే, సహకారం ఇవ్వకపోతే  ఈ పోటీలో వాళ్ళు గెలుపు సాధించడం కష్టమని, ఈ  గెలుపే ఇకపై  పిల్లల జీవన విధానాన్ని నడిపించనున్నదని అ(పా)ర్థం చేసుకున్న తల్లిదండ్రులు కూడా పిల్లలను చదువుల చట్రాల్లో ఇరికించి ఊపిరాడనివ్వకుండా చేస్తున్నారు. రేపటి గొప్పపౌరులుగా తయారవడం కోసం పిల్లలు   తమ బాల్యాన్ని బలిపెట్టవలసి వస్తోందని చాలా మంది  పెద్దలు అర్థం చేసుకోవడం లేదు. 
ఆనాడు మనం అనుభవించిన ఆ అందమైన బాల్యాన్ని మన పిల్లలు  కోల్పోతున్నారే  అని చాలామందికి బాధగా ఉంటోందిప్పుడు. ఇప్పటి వాతావరణంలో అప్పటి ఆహ్లాదకరమైన వినోదం లేకపోవడం ఒక ఎత్తైతే - మరొక ప్రమాదకరమయిన వాతావరణం మనచుట్టూ అలముకొని మన పసిబిడ్డల మనసులను కలుషితం చేస్తోంది.  

 దానిమీద మనకి దృష్టి ఉందా అసలు.....????
ఇరవయ్యవ శతాబ్ది అర్థ భాగంలో సామాజిక వ్యవస్థలో  ప్రారంభమయిన మార్పు సమిష్టికుటుంబాల నుండి వ్యష్టి కుటుంబాల దిశగా మరలడం. మరొకటి స్త్రీ పురుష భేదం చాలావరకు సమసిపోవడం. సమాజంలో తమ వ్యక్తిత్వాన్ని, తమ స్వాతంత్ర్యాన్ని,ప్రతిభా విశేషాలను, నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ పురుషులతో సమానంగా అన్ని ఉద్యోగాలను సమానమైన ప్రతిభతో నిర్వహిస్తున్నారు ఇప్పటి స్త్రీలు. అందువలన గృహమే కదా స్వర్గసీమ అనే పాట ఔట్ డేట్ అయిపోయింది. లేచింది నిద్రలేచింది మహిళాలోకం అన్న పాత పాటే  లేటెస్ట్ అయింది.

భార్యాభర్తలు ఉద్యోగాలకు వెళ్ళకతప్పని పరిస్థితులలో వారికి  పుట్టిన పిల్లలు స్కూలుకు వెళ్ళే వయసు వచ్చే వరకు ఎవరి సంరక్షణలో ఉండాలన్నది ఒక సమస్య, స్కూలునుంచి వచ్చినా తల్లి తండ్రులు ఇళ్ళు చేరే వరకు ఎవరిదగ్గర ఉండాలన్నది మరో సమస్య. ఇక్కడే అమ్మమ్మలు, బామ్మలు, తాతగార్ల పాత్ర కీలకం అయింది.  తప్పని పరిస్థితులలో కేర్ సెంటర్లలో పిల్లలను అప్పగించినా అవకాశం ఉన్నంత వరకు పిల్లల అమ్మమ్మలు, నాయనమ్మలు తాతగార్ల సంరక్షణలో వారిని  ఉంచుతున్నారు అమ్మానాన్నలు. 
పగలు పదకొండుకి ప్రారంభం అవుతాయేమో టీవీలో సీరియల్స్, అక్కడినుండి రాత్రి పదకొండు వరకు కూడా టీవీలో  సీరియల్స్ సాగుతూనే ఉంటాయి. తెలుగే కాదు అన్ని భాషలలోను ఈ సీరియల్స్ ప్రభంజనం కొనసాగుతోంది. మిగిలిన భాషలేమోకాని మన తెలుగులో మాత్రం చాలా ఛానెల్స్ లో ఇతర భాషల నుండి డబ్బింగ్ చేయబడిన సీరియల్స్ చాలా వస్తున్నాయి. 
ప్రతి ఇంట్లో  వయసైన  ఆడవాళ్ళు, రిటైర్ అయిన మగవాళ్ళు, ఉద్యోగానికి వెళ్ళడానికి అవకాశం లేక ఇల్లు చూసుకునే  గృహిణులు చాలామంది ఈ సీరియల్స్ కి అలవాటుపడి ప్రతిరోజూ ఆ సమయానికి వాటిని  వదలకుండా చూస్తున్నారు. ఇదివరకులా అమ్మలక్కల కబుర్లు, ఇరుగుపొరుగు ఆడవాళ్ళు చేరి ముచ్చట్లు పెట్టుకోవడం ఇప్పుడు దాదాపుగా తగ్గిపోయింది. ఇంటికి ఎవరైనా వస్తే ఆ సీరియల్ ని చూడడం అవదేమో అని బాధపడేంతగా పరిస్థితులు మారిపోతున్నాయి. 
పాతకాలపు ఇండిపెండెంట్ ఇళ్ళు చాలావరకు అపార్ట్ మెంట్స్ గా మారిపోయాయి. ఇళ్ళు చిన్నవైపోవడంతో, ముందు వాకిలి, వెనక పెరడు లాంటివి లేవుగా, అన్నీ ముందు గదిలోనే.  బియ్యం ఏరుకున్నా, కూరలు తరిగినా,  పిల్లలకు అన్నం తినిపించినా, మనం తింటున్నా అన్నీ ఆ టీవీ ముందే, ఆ సీరియల్స్ నేపథ్యంలోనే.

ఈ సీరియల్ ఏమిటి ఇలా ఉంది.... బాలేదు.. చూడకు అనడానికి ఇంట్లో ఎవరికీ వీలవదు. ఆ ఛానెల్ మార్చడానికి కూడా వీలవదు. బయటకి వెళ్ళి సాయంత్రం తిరిగివచ్చేసరికి  వాళ్ళకోసం అన్ని అమర్చి పెట్టి, వాళ్ళ పిల్లల అల్లరి భరించి టీవీముందు కూర్చొని విశ్రాంతి తీసుకుంటున్న తల్లిదండ్రులను నొప్పించడం ఇష్టంలేక చాలామంది టీవీ సీరియల్స్ ను భరిస్తున్నారు. మర్యాదకో, చానెల్ మారిస్తే జరిగే గొడవకో భయపడే వాళ్ళు,  వీలయిన వాళ్ళు బెడ్ రూమ్ లో మరోటీవీ అమర్చుకొని వాళ్ళకు కావలసిన ఛానెల్స్ చూస్తున్నారు.
కానీ  స్కూల్లో చేరే వయసు ఇంకా రాని పిల్లలు, వెళ్ళినా మధ్యాహ్నం నాలుగుగంటలకల్లా ఇల్లు చేరుకొనే పిల్లలు అమ్మలు, అమ్మమ్మలేదా బామ్మ, తాత లతో పాటు చూసేవి టీవీ కార్యక్రమాలే. తల్లిదండ్రులు ఏ ఎనిమిది గంటలకో ఇల్లుచేరుకునేలోపల వాళ్ళు గడపవలసినది టీవీ ముందే. 
మరి టీవీల్లో చూపిస్తున్న సీరియల్స్ వాటిల్లో కథా కమామీషు, పాత్రలు ఎలా ఉన్నాయో చూస్తున్నారా. గమనిస్తున్నారా. 
ఇంచుమించు ప్రతి సీరియల్ లోను ఒక గయ్యాళి  అత్తగారు, చేతకాని మామగారు, ఆరళ్ళు పెట్టే ఆడపడుచు, ఆవిడకి కూడా చేతకాని మొగుడు, అమాయకురాలై వీరందరి పాలబడి వారిచేత హింసింపబడే కోడలు వీటిలో ప్రధాన పాత్రలు . ఒకవేళ మరిది ఉంటే వాడు మంచివాడైతే వదినని సమర్థిస్తూ, ఆమెతో సంబంధం ఉన్నవాడిగా  కుటుంబంతో వెలివేయబడిన వాడౌతాడు. చెడ్డవాడైతే ఆ వదిన్ని ఇంటిలోంచి తరిమేయడానికి నడుం కట్టుకున్నవాడై  ఉంటాడు. 
ఇంక ఈ కథని ఎన్ని రకాల మసాలాలు వేసి వండి వడ్డిస్తారో రకరకాల ఛానెల్స్ లో చూడవచ్చు.

మరి కొన్ని సీరియళ్ళలో ఊరికే తమ కోడలిని బాధించడం తో సరిపెట్టరు. ఆమెకి విషం ఇచ్చి చంపేయాలని కుట్ర పన్నుతూ ఉంటారు. ఆ విషం వంటింట్లో ఉప్పు, పప్పుతో పాటు అత్యంత సహజంగా అలమారలో కొలువై ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు అత్తను కోడలో, కోడలిని అత్తో, తోడికోడళ్ళో, మరుదులో ఒకరినొకరు  చంపడానికి వాడుకుంటూ ఉంటారు. కానీ వారి ప్రయత్నం సఫలమా, విఫలమా అన్నది తేలడానికి మాత్రం అథమం ఓ ఆరు ఎపిసోడ్లేనా పడుతుంది. 
 మరికొన్ని హారర్ సీరియల్స్. వీటిలో ఇవి మరీ ప్రమాదకరమైనవి.  పాత్రల హావభావాలు, కుళ్ళు , కుతంత్రాలు వీటితో ముఖ కవళికలతో చేసే విన్యాసాల వలన పుట్టిన హారర్ ఒకఎత్తు. కానీ కథలో మంచిపాత్రలను హింసించడం లో భాగంగా కడుపులో ఉన్న పిండాన్ని చంపడానికి, ఆస్తికి వారసులైన పిల్లలను చంపించడానికి చేతబడి వంటి క్షుద్రవిద్యలను, ఆ క్షుద్రవిద్యను ఉపాసించే మాంత్రికులను ప్రధానమైన పాత్రలుగా చూపించడం  మరొక ఎత్తు. ముఖ్యంగా పసిపిల్లల పై జరిగే హత్యాప్రయత్నాలు చాలా సీరియల్స్ కి ముడిపదార్థాలు. 
ఈ సీరియల్స్ కథలలో  భాషా భేదం లేదు. హిందీలో నైనా తమిళంలో అయినా తెలుగులో అయినా అదే కథ. అవే పాత్రలు. భాష మారుతుందంతే.

స్నిగ్థ మోహనమయిన రూపం, కోమలమైన నాజూకు శరీరం,అమాయకమైన చిరునవ్వు,దేవుడికి మారుపేరులా ఉంటారు పసిపాపలు... స్వచ్ఛమైన వారి పాల మనసులను విషపూరితం చెయ్యడం కాదూ ఈ కథలు చూపించడం అంటే.
ఇదిగో ఇలాంటి సీరియల్స్ మన వాళ్ళలో చాలా మంది చూస్తున్నారు. వాళ్ళు మా అమ్మగారు కావచ్చు, మీ అత్తగారు కావచ్చు. మన పిన్నో, అత్తో కావచ్చు. (గమనించినంతవరకు ఈ సీరియల్స్ ని ఉత్సాహంగా చూసే మగవారి శాతం అతి తక్కువ. అందుకనే ఆడవాళ్ళ పేరు చెప్పవలసి వస్తోంది).  కానీ వాళ్ళ దగ్గర పెరుగుతున్న పసిపిల్లలపై  ఈ టీవీ కార్యక్రమాల ప్రభావం ఎంతగా ఉంటుందో మనం గమనిస్తున్నామా?

మొన్న ఒక పదినిముషాలు టీవీ ముందు నిల్చున్నందుకు  ఒక సీరియల్లో ఒక ఎపిసోడ్  చూసాను. ఇద్దరు భార్యల సీరియల్ అది. ఒక భార్యకి పుట్టిన అమ్మాయికి పెళ్ళవుతూ ఉంటే ఎలాగైనా ఆ పెళ్ళికూతురిని చంపేద్దామని ఓ పాత్ర పాలల్లో  విషం కలిపి తీసుకొస్తుంది. ఆ విషం కలిసిన గాజు గ్లాసును మరో పాత్ర అందుకొని తాగేయబోతుంది. మనకి మూడుసార్లు మూతిదగ్గరకి గ్లాసును చేర్చడం చూపిస్తారు. కానీ ఆమె ఆ గ్లాసుని తాగకుండా పట్టుకొని ఇరవై నిముషాలు  గొడవ పెడుతూ మాట్లాడుతుంది. తర్వాత ఆ ....నా కడుపు నిండిపోయింది. ఇంక ఈ పాలెందుకు అని ఆ గాజుగ్లాసుని నేలమీద విసిరి, బద్దలు కొట్టి మామూలుగా ఇంట్లోకి వెళ్ళిపోతుంది. 
నాకు ఒళ్ళు మండిపోయింది. బహుశ కిందపడిన ఆ పాలను పిల్లో, కుక్కో తాగి చనిపోయినట్టుగా తర్వాత ఆరువందల యాభయ్యవ ఎపిసోడ్ లో చూపిస్తారేమో అనుకుంటా. కానీ పాలు తాగక పోతే ఓ టేబుల్ మీద అంచులో పెట్టినట్టో, చూడకుండా ఏ చిన్నపిల్లడో వచ్చి కింద పడేసి  పెద్దవాళ్ళు తిడతారని పారిపోయినట్టో చూపించవచ్చుగా. అడ్డగాడిదలా పెరిగి, ఆడదై ఉండి ఓ గాజుగ్లాసును నలుగురూ నడిచే దారిలో విసిరి పారేయడమా... పెద్దవాళ్ళే అలా ప్రవర్తించినట్టు చూపిస్తే ఇక పిల్లలకేం నీతి చెప్తాం !!
అలాగే  హింసించి ఆనందించడంలో భాగంగా నేలమీద నూనె పొయ్యడం, నడుస్తుంటే కాలు అడ్డం పెట్టి పడిపోయేలా చెయ్యడం, కూర్చోబోతుంటే కుర్చీలు లాగేసి పడేయడం  అదే పెద్ద కామెడీలాగా అందరూ పడి పడి నవ్వడం చాలా సాధారణంగా చూపిస్తూ ఉంటారు.  

ఒకటా రెండా ఎన్ని సీరియల్స్!! ఎన్ని అరగంటలు!! వీటిలో అన్నో కొన్నో చూస్తూనే ఉన్నారు పిల్లలు.  బామ్మఒళ్లో ఆడుకుంటూ, తాతపక్కన సోఫాలో దొర్లుతూ... కొన్ని వాళ్ళంతట వాళ్ళు  చూడకపోయినా చెవిలో పడేలా దడదడలాడే మ్యూజిక్ తో వాళ్ళని ఆకర్షిస్తూ ఉంటాయి.
 పైగా పాత్రలు మాట్లాడుకునే భాష ఎంత సంస్కారంగా ఉంటుంది అంటే....
ఒసే, నువ్వయిపోయావే..., నిన్ను మసిచేస్తానే,  నిన్ను లేపేయడం నాకు చిటికెలో పనే. ఏంటే తెగ రెచ్చిపోతున్నావ్... నువ్వసలు ఒక అమ్మకీ అబ్బకీ పుట్టి ఉంటే రారా...రేయ్.. నువ్వు మగాడివే అయితే....ఇదీ ధోరణి.
మనం చందమామను  చూపిస్తూ  అన్నం పెట్టే అమ్మని చూసాం. అదే అమ్మ అమ్మమ్మగా  మనవలను ఆడించే దశకి వచ్చేసరికి ఎంత మారిపోయింది.... ఇప్పుడు చందమామని కాదు టీవీ చూపిస్తున్నారు. అన్నం పెడుతూ. చూడమ్మా... చూడు... ఆ దొంగ ఆ అమ్మాయిని చంపేస్తాడు చూడు....అమ్మో...గబ గబ తినేయమ్మా... వాడిచేతిలో కత్తి చూసావా...అమ్మో... ఇలా ఉంటుంది ఆ సన్నివేశం.
టీవీ సీరియల్స్ లో  చంపడం, చంపించడంతో పాటు  రేప్ సన్నివేశాలు కూడా చోటుచేసుకుంటున్నాయట. ఈమధ్యో ఏదో సీరియల్ లో ఈ రేప్ సన్నివేశం చూసానని, ఒకంతట ఆ సీన్ ముగియలేదని, కంపరం పుట్టిందని  తెలిసిన  అమ్మాయి చెప్పింది.
చిన్నప్పుడు సర్టిఫికెట్ ఇచ్చిన సినిమాలు గానీ, హత్యలు, ఫైటింగ్స్ కానీ ఉన్న సినిమాలు చిన్న పిల్లలు  చూడకూడదని, చెడిపోతారని అనేవారు తాతగారిలాంటి పెద్దవాళ్ళు. ఇప్పుడవన్నీ టీవీ రూపంలో నట్టింట్లోకి నడుచుకొని వచ్చేస్తుంటే కళ్ళప్పగించి చూస్తూ ఉన్నాం. మన కళ్ళెదుటే మన పిల్లలు ఆసక్తిగా చూస్తూ ఉంటే మనకి పట్టనట్టుగా ఉండిపోతున్నాం. 
క్రైం, హింస, శాడిజం ఇవన్నీ మూసపోసిన పాత్రలతో, వండిన సీరియల్స్ ని మనమంతా ఎందుకు ఎలా భరిస్తున్నాం? పూర్వం  ప్రతినాయకుడు అంటే విలన్ పాత్రలో ఇలాంటి లక్షణాలన్నీ మూర్తీభవించి ఉండేవి. నాటకాలలో ఇలాంటి పాత్రలు చూడడం వలన మనలో రసోత్పత్తి కలిగి మన మనసులో ఉన్న కుళ్ళు, కల్మషం కరిగిపోయి స్వచ్ఛంగా  మారుతామని మన రసవాదులు చెప్తారు. 

బహుశ మనవాళ్ళు,  మన బాహ్య ప్రపంచంలో బహు మంచివాళ్ళు అనిపించుకున్న వాళ్ళు కూడా ఈ సీరియల్స్ లోని దుర్మార్గపు పాత్రలను  పదే పదే చూసి వాళ్ళ భావాలను తాము కూడా  అనుభవిస్తూ  తమలో ఏ కాస్తైనా ఉన్న చెడుని, చెడు తలంపులని కడిగేసుకొని స్వచ్ఛంగా మేలిముత్యాలలా మారిపోతారా...
లేదా.....
నీతి నిజాయితీలతో బాధ్యతగల ఆదర్శవంతమైన రేపటిపౌరులను తీర్చిదిద్దవలసిన బాధ్యత గల  పెద్దలు - ఈనగాచి నక్కల పాలు చేసినట్టు, కూర్చున్న కొమ్మనే నరుక్కున్నట్టు తమ తెలివితక్కువ తనంతో  నేటి బాలలే రేపటి క్రిమినల్స్ అన్న కొత్త నినాదానికి తెరతీస్తారా. సమాధానం ఎవరు చెప్తారు?!!


(కలభాషిణి  రాసిన సరదా పోస్టుకి ఇది సీరియస్ కొనసాగింపు)