17 April 2013

"వరూధినీ ప్రవరాఖ్య "- భళారె !! మన సినారె !!



అభినవ ఆంధ్ర భోజుడు శ్రీ కృష్ణ దేవరాయల ఆస్థానంలోని కవులను అష్ట దిగ్గజాలు అంటారు. అందులో ముఖ్యమైన కవి దిగ్గజం అల్లసాని పెద్దన. ప్రబంధం అనే సాహిత్య ప్రక్రియకి పాదులు వేసినవాడు అల్లసాని పెద్దను. స్వారోచిష మనుసంభవము అనే కథను గొప్ప ప్రబంధంగా తీర్చిదిద్దాడు. పెద్దనతో ప్రారంభమైన ఈ ప్రక్రియ కనీసం రెండు వందల సంవత్సరాల వరకు సాహిత్యంలో ముఖ్యమైన పాత్ర వహించింది.

మారన  రచించిన "మార్కండేయపురాణం"  నుంచి పెద్దన మనుచరిత్రము  కథా వస్తువును తీసుకున్నాడు. దానికి స్వకపోల కల్పనలతో, వర్ణనలతో విస్తరింపచేసి ప్రబంధానికి ఉండవలసిన సర్వ లక్షణాలను సమన్వితం చేసి తరువాతి ప్రబంధ కవులకు మార్గ దర్శకుడయ్యాడు.


ప్రవరుడు అనే ఆఖ్య అంటే పేరు గలవాడు, ప్రవరాఖ్యుడు. ప్రవరాఖ్యుడు అనే పదం  పరస్త్రీల వైపు కన్నెత్తి   కూడా  చూడనివాడు అని తెలుగు జాతీయంగా స్థిరపడిపోయింది. వరూధినీ ప్రవరాఖ్య వృత్తాంతం అంతగా ఆంధ్రసీమకు పరిచయం కావడానికి కారణం పెద్దన గారి మనుచరిత్ర కావ్యం. ఈ కావ్యంలో మొత్తం ఆరు ఆశ్వాసాలు ఉండగా అందులో మూడు ఆశ్వాసాల వరకూ పూర్తిగా వరూధినీ ప్రవరాఖ్యుల  వృత్తాంతమే ఉంటుంది. సర్వలక్షణ శోభితుడైన ధర్మవీరుడు మనువు అతని జన్మకి కారణంగా ఈ వరూధినీ ప్రవరాఖ్యుల వృత్తాంతం చెప్పబడుతుంది.

వరూధిని ప్రవరాఖ్యుడి అతిలోక సౌందర్యం చూసి మోహిస్తుంది.  కానీ ధర్మ నిష్ఠ కలిగిన అతను ఆమెను  తిరస్కరించి వెళ్ళిపోతాడు. ఆమెపై ఎప్పటినుండో కన్నువేసిన కలి అనే ఓ గంధర్వుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మాయా రూపం ధరించి ప్రవరుడిగా ఆమె ముందు నిలు స్తాడు. అతను నిజంగా ప్రవరాఖ్యుడే అనుకుని అతని షరతులకు అంగీకరించి అతనిని వివాహం చేసుకుంటుంది వరూధిని.  గర్భవతి అయిన వరూధిని తన  చేసిన మోసాన్ని గ్రహించకముందే అక్కడినుంచి తప్పుకుంటాడు మాయా ప్రవరుడు. వరూధినికి ఎప్పటికీ తెలియని నిజం ఏమంటే తను వివాహమాడినదీ, పుత్రుడిని కనబోతున్నదీ ఓ మాయా ప్రవరుడికి అని. ఆమెకు పుట్టినవాడే స్వరోచి. అతని కుమారుడే స్వారోచిషుడు మనువు.

ప్రవరుడిని ఊహిస్తూ వరూధిని గంధర్వుడితో  జీవించడం వల్ల స్వరోచికి శాంతగుణ ప్రధానుడై, భక్తి వైరాగ్యసంపన్నుడైన కుమారుడిగా స్వారోచిష మనువు కలిగాడు. ప్రవరుడిలోని ధర్మవీరోత్సాహం ప్రవరుడి తేజస్సు స్వారోచిషుడిలో కలగడానికి ఈ వరూధినీ ప్రవరాఖ్యుల వృత్తాంతమే కారణమైంది కనుక పెద్దన ఈ కథకు ఇంత ప్రాధాన్యం ఇచ్చారని విమర్శకులు అంటారు.

ఇంత గొప్ప కావ్యంలోని ఇంత ప్రధానమైన కధని,. అందులోను మూడు ఆశ్వాసముల పైన రచించబడిన కథని ఓ సినిమాలో కేవలం ఓ పదిహేను  నిముషాల వ్యవథిలో చెప్పాలి అంటే అది ఎంత గొప్ప సాహసం. అటువంటి సాహసం చేయడానికి ఆ కవికి కవిత్వం పై ఎంత పట్టు ఉండాలి?! మూలకావ్యంలోని అంశాలను వాటి సౌందర్యాన్ని, పాత్రల సజీవ లక్షణాలను కాపాడుతూ సంభాషణలు గేయరూపంలోకి,  మాటలరూపంలోకి  మార్చాలంటే   ఎంత నిగ్రహం ఉండాలి?!

అల్లసాని వారి అల్లిక జిగిబిగి అని పేరు. అటువంటి కవి  పద్యాలను  సందర్భోచితంగా ఉపయోగిస్తూ, సినిమా సంగీతానికి అనుగుణంగా పదాలను మార్చుతూ, అందరికీ అర్థమయ్యే రీతిలో పాడుకునే పాటగా రాసి  శభాష్ అనిపించుకున్న  ఆ గొప్పదనం ఎవరిది?!


ఇంకెవరిది.... సాహిత్యంలోని అన్ని ప్రక్రియలలోను అత్యంత ప్రతిభాపాటవాలను ప్రదర్శించి కవిగా, విమర్శకుడిగా, ఆచార్యుడిగా విభిన్నమైన పదవులను నిర్వహించి దక్షుడిగా ఇంటగెలిచి, 

విశ్వంభరతో జ్ఞాన పీఠ్ బహుమతిని అందుకుని రచ్చగెలిచి, తెలుగు గౌరవాన్ని ఇనుమడింపజేసిన సింగిరెడ్డి నారాయణరెడ్డి గారిదే.... అవును!! అతనే సినారె.

మనుషుల్లో దేవుడు(1974) అనే చిత్రంలో నాయికా నాయక పాత్రలు(ఎన్. టి. ఆర్. వాణిశ్రీ)  ఓ అంతర్నాటకం  ప్రదర్శించే సందర్భంలో పాట రాయడానికి  ఈ వరూధినీ ప్రవరాఖ్యుల వృత్తాంతాన్ని నాటకానికి వస్తువుగా తీసుకున్నారు సినారె. అన్ని వందల పద్యాలలో పెద్దనగారు చెప్పిన కథనంతా కథలో ప్రముఖమైన ప్రచారం లో ఉన్న రెండు మూడు పద్యాలను మాత్రం ఉంచి తక్కినదంతా  గేయాత్మకశైలిలో తన సంభాషణలు జోడించారు.


వరణానదీ తీరంలో అరుణాస్పదం అనే పురంలో ప్రవరుడు అనే పేరు గల బ్రాహ్మణయువకుడు ఉండేవాడు. అతను నిత్యాగ్ని హోత్రుడు, నిరతాన్నదాత. వివాహితుడు. ధర్మాచరణపట్ల ఎంతో బద్ధుడైనవాడు. అతనికి ఒక వింత అలవాటు ఉండేది. అదేమిటంటే కొత్త ప్రదేశాల గురించి తెలుసుకోవడం పట్ల ఆసక్తి. ఆ  ఆసక్తి తోనే ఒకనాడు తన ఇంటికి వచ్చిన ఓ సిద్ధుడికి తగిన మర్యాదలు చేసి, భోజనం పెట్టి అతని యాత్రా విశేషాలు అడుగుతాడు. అతను ప్రపంచంలోని నలుదిక్కులు చూసి వచ్చాడని తెలుసుకుని అంత స్వల్పకాలంలో  అంతంత దూరాలు ఎలా వెళ్ళగలిగాడు అని ఆశ్చర్యపోతాడు. సిద్ధుడు ప్రవరుడి ఆసక్తిని, ఆశ్చర్యానికి ముగ్ధుడై అతని పట్ల అవ్యాజమైన ఆత్మీయతతో తన వద్ద ఉన్న పసరును ప్రవరుడి కాళ్ళకి పూసి అతను కూడా ఎక్కడికైనా వెళ్ళి రాగల శక్తిని కలిగించి తన దారిని తాను వెళ్ళిపోతాడు.ప్రవరాఖ్యుడు హిమాలయపర్వతాలు చూడాలనుకుని అక్కడికి వెంటనే చేరుకుంటాడు. ఈ కథను ఇక్కడ నాటకం ప్రారంభంలో  క్లుప్తంగా ఇలా చెప్తారు సినారె తన స్వరంతో.

ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్ర తెలుగు ప్రబంధాలలో మొదటిది. ఆ మహా కావ్యంలోని సుమధుర ఘట్టమే వరూధినీ ప్రవరాఖ్య వృత్తాంతం. ఎవరా వరూధిని  దివినుండి భువికి దిగివచ్చిన అప్సరో శిరోమణి. మరి ఈ ప్రవరుడు. నిత్యాగ్ని హోత్రి నిరతాన్నదాత. ఒకనాడు ఆకస్మికంగా తన ఇంటికి అతిథిగా విచ్చేసిన సిద్ధుడిని సేవించి తన తీర్థయాత్రా  వివరించాడు ప్రవరుడు. అనుగ్రహించాడు సిద్ధుడు. కాలికి పసరు పూసాడు. రివ్వున గగనానికి ఎగిరాడు ప్రవరాఖ్యుడు.  ఎన్నెన్నో తీర్ధాలను దర్శించి చివరకు చేరుకున్నాడు ఉత్తుంగ తుంగ హిమాలయ సన్నిధికి.

ప్రవరాఖ్యుడు హిమాలయాల సౌందర్యాన్ని చూసి మురిసిపోతాడు. అక్కడి పర్వతాలు, ఆకాశాన్ని అంటే శిఖరాలు, లోయలు, పచ్చని ప్రకృతి బయళ్ళు, పురివిప్పి ఆడే నెమళ్ళు, ఆ ప్రాంతంలో విహరించే జంతుజాలాలు ఇలాంటి విశేషాలెన్నో పెద్దన వర్ణించారు. వీటిలో

అటజని కాంచె భూమి సురుడంబర చుంబి శిరస్సరఝ్ఝరీ
పటల ముహుర్ముహుర్లుఠ దభంగ తరంగ మృదంగ నిశ్వన
స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్
గటక చరత్కరేణుకర కంపిత సాలము శీతశైలమున్(పెద్దనగారి పద్యం)  

అన్న ఈ ప్రముఖ మైన పద్యాన్ని తీసుకుని అందులో కొద్దిగా మార్పులు  చేసి ప్రవరుడితో ఇలా పలికించారు – సినారె.


అహో హిమవన్నగము
భరతావనికే తలమానికము
అహో హిమవన్నగము!!

అంబర చుంబి శిఖరాలు, శిరఝ్ఝరీ తరంగాలు,
ఆ అభంగ తరంగ మృదంగ రవముల
అభినయమాడు మయూరాలు   
అంటూ హిమాలయాలను ప్రశంసిస్తాడు. పెద్దనకాలం నాటికి ఉందో లేదో తెలీదు కానీ భరతావనికే తలమానికము అంటూ ఇప్పటి  మన భారతదేశానికి శిరఃభాగంలో ఉండడం వల్ల తలమానికంగా శోభిస్తోంది అనే ఔచిత్యంతో కూడిన మాటలు రాసారు సినారె. సినిమా పాటకి అనుగుణంగా పద్యంలోని " పరిఫుల్ల కలాప కలాపీ జాలమున్"  అనే పద్య పాదాన్ని  అభినయమాడె మయూరాలు అన్న ఒక్క పదంతో ఇమడ్చారు.

హిమాలయాలు భారతదేశానికి  కేవలం ఓ సరిహద్దు గిరులు మాత్రమే కాదు. పవిత్రమైన గంగానది విష్ణువు పాదలనుండి భగీరథుడి మనోరథం కోసం భువికి దిగివచ్చి తాకిన ప్రదేశం. అది మహాదేవుడు ఈశ్వరుడి   నిజ నివాసం. పార్వతీ దేవికి పుట్టిల్లు. శివపార్వతుల మధ్య   ప్రణయాగ్ని రగిల్చే ప్రయత్నం చేసి ఆ  ప్రయత్నంలో ఆ అగ్నికి మన్మథుడు తానే ఆహుతై శరీరాన్ని పోగొట్టుకున్న ప్రదేశం. ఇలా  ఎన్నో పురాణాలకు,  ఆటపట్టులు హిమాలయ సానువులు. ప్రవరుడు ఆ పర్వత సానువుల్లో చరిస్తూ ఆ విశేషాలన్నీ గుర్తుచేసుకుంటున్నాడు.

భగీరథుడు తపియించిన చోటు,
గగన గంగనే దించిన చోటు,
పరమేశుని ప్రాణేశుగ బడసి
గిరినందన తరియించిన  చోటు  అంటూ తన మాటలతో ప్రవరుడు దర్శించిన హిమాలయాలను వర్ణించారు సినారె.

ఆ గిరుల సౌందర్యాన్ని ఎంతసేపు చూసినా తనివితీరలేదు. మళ్ళీ రేపువద్దాం ఆలస్యమవుతోంది అనుకుని తిరిగి వెళ్ళే ప్రయత్నం చేసాడు.

సిద్ధుడిచ్చిన కాలి పసరుతో సిద్ధించెను  వాంఛితమ్ము
పుణ్యతీర్థ సందర్శనమ్ముతో పునీతమాయెను జీవితమ్ము

అనుకున్నాడు.  అప్పుడు తెలుసుకున్నాడు  ఆ సూర్యకాంతికి కరిగిన మంచుతో పాటుగా తన పాద లేపనం కూడా కరిగి నీరైందని. ఇక ప్రవరుడికి తిరిగి వెళ్ళే దారి కనిపించక, ఏ మార్గమూ తోచక  అల్లాడుతూ అక్కడే తిరగసాగాడు. "కాలిపసరు కరిగి పోయెనే! ఇల్లు చేరు తెరువు ఎఱుగనైతినే" అని విచారిస్తూ.


ఎక్కడి మా అరుణాస్పద పురము
ఎక్కడి ఈ హిమవన్నగ నగము
కోరి వచ్చినాను దారి కోలుపోయినాను
ఎగిరిపోదమన్ననాకు రెక్కలైన లేవే
ఏదిక్కు  కానరాదే అంటూ ఇల్లుచేరే దారి వెతుకుతూ ముందుకు సాగాడు.

అలా ఆ పర్వత గుహలదారుల్లో తిరుగుతున్న ప్రవరుడికి మధుర మంజుల వీణానాదం వినిపించింది. మనుషుల ఆవాసాల జాడ కనిపించి ఇంటికి వెళ్ళే దారి దొరుకుతుందని సరదా పడ్డాడు. అక్కడ  అద్భుతమైన సౌందర్యరాశిని ఎదురుగా చూసాడు.  తన నివాసానికి చేరకున్న ప్రవరుడిని చూసింది గంధర్వ కన్య వరూధిని. ప్రవరుడి రూపురేఖావిలాసాలను, సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యపోయింది అప్సరస- వరూధిని.

ఎక్కడివాడో యక్ష తనయేందు జయంత వసంత కంతులన్
జక్కదనంబునం గెలువఁజాలెడి వాడు మహీసురాన్వయం
బెక్కడ  యీ తనూవిభవమెక్కడ యేలనిబంటుగా మరుం
డక్కఁగొనగ రాదె యకటా నను వీడు పరిగ్రహించినన్(ఇది పెద్దనగారి పద్యం)

అంటూ "యక్షరాజైన కుబేరుడి కొడుకు నలకూబరుడు, చంద్రుడు, ఇంద్రుడి కొడుకైన జయంతుడు, వసంతుడు, మన్మధుడు ఇలా ఎంతో అందమైనవారుగా పేరుపొందిన వీరందరినీ మించిన సౌందర్యం ఈ బ్రాహ్మణుడు కలిగి ఉండడం ఏమిటి?!" అని ఆశ్చర్యపోయింది. ఇంత       గొప్ప అందగాడు నన్ను చేపట్టితే ఇక మన్మధుడు కూడా నాకు దాస్యం చేస్తాడు కదా అని అతని అందాన్ని మెచ్చుకుంది. అలా అతన్ని        చూస్తూనే ఉండిపోయింది వరూధిని.

పాపం అమాయకుడు ప్రవరుడు. తనలాగే ఆమె కూడా దారి తప్పి ఉంటుందనుకున్నాడు. మగవాడు, ధీరుడు తనకే ఇలా ఉంటే స్త్రీ కదా ఆమె ఎంత భయపడుతోందో అనుకున్నాడు.  అందుకే  తన సౌందర్యాన్ని  కళ్ళార్పకుండా చూస్తున్న వరూధినిని " ఎవ్వతెవీవు భీత హరిణేక్షణ" అంటూ  ప్రశ్నించాడు.  

ఎవ్వతెవీవు భీత హరిణేక్షణ యొంటి చరించెదోటలే
కివ్వనభూమి భూసురుడ నే బ్రవరాఖ్యుఁడఁ ద్రోవతప్పితిం
గ్రొవ్వున నిన్నగాగ్రమునకుం జనుదెంచి పురంబుఁజేర నిం
కెవ్విధిఁ గాంతుఁ దెల్పగదవే తెరువెద్ది శుభంబు నీకగున్
 (ఇది పెద్దనగారి పద్యం)

ఇలాంటి వనభూముల్లో ఒంటరిగా భయంలేకుండా తిరుగుతున్నావు ఎవరు నీవు అని అడిగాడు. తాను ప్రవరాఖ్యడనని, చెప్పాడు. అప్పటికే సిద్ధుడు ఇచ్చిన పసరు మహిమతో పుణ్యక్షేత్రాలయిన కాశీ ప్రయాగలాంటి జనసమ్మర్దం ఉన్న చోటికి వెళ్ళకుండా ఒంటరిగా ఈ హిమాలయాలకు ఎందుకు వచ్చానో అనే అపరాధ భావం పీడిస్తూ ఉంది అతనికి. అందుకే " గ్రొవ్వున నిన్నగాగ్రమునకు జనుదెంచి" అని తనని తాను తిట్టుకున్నాడు. ఇక ఇంటికి వెళ్ళే దారి ఏమిటో ఆమె చెప్పగలిగితే ఆమెకు శుభం కలుగుతుందని  బ్రాహ్మణ సహజమైన లక్షణంతో ముందుగానే దీవిస్తాడు ప్రవరుడు.

కానీ అప్పటికే ప్రవరుడి సౌందర్యం చూసి మతి పోగొట్టుకుంది వరూధిని.  ఇల్లు చేరాలనే అతని ఆత్రుతని, కంగారుని పట్టించుకోకుండా వేళా కోళం చేయడం ప్రారంభించింది.

ఇంతలు కన్నులుండ దెరువేవరి వేఁడెదు భూసురేంద్ర యే
కాంతమునందునున్న జవరాండ్ర నెపంబిడి పల్కరించులా
గింతియ కాక నీ వెఱుఁగవే మును వచ్చిన త్రోవచొప్పు నీ
కింత భయంబులేకడుగ నెల్లిదమైతిమి మాటలేటికిన్ (పెద్దనగారి పద్యం)

"ఇంత పెద్ద  పెద్ద కళ్ళు పెట్టుకుని చూస్తూ  దారి తెలియలేదంటావేం,
 ముందు నీవు నడిచి వచ్చిన దారి  ఏంటో నీకు నిజంగా తెలియదా ఏమిటి. ఒంటరిగా ఉన్న స్త్రీ కనిపిస్తే పలకరించడానికి నెపం వెతుకుతున్నావు గానీ " అంటూ నర్మగర్భంగా మాట్లాడింది.

"ఎంతమాట! ఈ ప్రవరుడట్టి వాడు కాడే"  అని ఆమె ఆరోపణలకు ఆశ్చర్యపోయాడు ప్రవరుడు. "ఆహా! అడుగకనే నీపేరు చెప్పిన ఆ తీయని నోటితో- నా పేరడగనైతివే. వరూధిని. అప్సరో శిరోమణి.  దివినుండి ఈ భువికి దిగివచ్చినాను.నీ మదన రూపమ్ము నే మెచ్చినాను –మనసిచ్చినాను "

 అంటూ సూటిగా అపర మన్మధుడి లాంటి అతని రూపం తనని ఎలా సమ్మోహన పరిచిందో వివరించి తన ప్రేమను వెల్లడించింది వరూధిని. ప్రవరుడు ఉలిక్కిపడ్డాడు. "వరూధినీ"  అంటూ ఆమెను వారించడానికి ప్రయత్నించాడు. ప్రవరుడి వారింపు ఆమెకు తొలి ప్రేమపలుకుగా తోచి వలపు మరింత రగిలించింది.


"ఆహ...ఎంత కమ్మని పిలుపు!! ఎన్ని మరులను గొలుపు" అంటూ పరవశించింది. "ఈ పూల పొదరింట చూపించు నీ వలపు"
 అంటూ అతనిని తన ప్రేమసీమకు ఆహ్వానించింది.

ప్రవరుడు ఎంతో బాధపడ్డాడు."శ్రీహరీ!! శ్రీహరీ!!  అపచారము! అపచారము!"
అని భగవన్నామ స్మరణ చేసాడు. 
"కలనైనా పరకాంతను తలచియైనా ఎరుగని వాడను. నిత్యాగ్ని హోత్రిని, నిష్టా గరిష్టుడను" అన్నాడు.అంతటి ధర్మనిష్ఠ గల తనపై వలపు తగదన్నాడు. 

వరూధిని పకపకా నవ్వింది. "ఓ అభినవ మదనా! నీ యజ్ఞయాగములు, ఈ జపతపములు- స్వర్గసౌఖ్యములు పొందుటకే కదా. ఆ సౌఖ్యమేదో నీముందు నాయందు లభింపనుండగా ఆలసింతువేల? అనుభవించ రావేలా!"
 అంటూ మంచి లాజిక్ ఉన్న ప్రశ్న వేసింది. మరణించాక దొరికే ఆ స్వర్గసౌఖ్యాలన్నీ జీవించి ఉండగానే తన పొందులోనే అనుభవించవచ్చు కదా అంది.
ప్రవరుడు "శ్రీహరీ  శ్రీహరీ" అని ఆమెనుంచి దూరంగా తప్పుకోవడానికి ప్రయత్నించాడు.

"ఓ సుందరా!!నేనోపలేనురా – ఈ మరుని తొందరా"అంటూ విరహంతో ఆపసోపాలు పడసాగింది వరూధిని.
"నిట్టూర్పు సెగలతో కందెను నా అధరము
ఎదపొంగులతో సడలెను నీవీ బంధము
మేనిలోన చెలరేగెను కానరాని తాపము
ఇకనేను సైపలేను ఈ విరహ దాహము
అంటూ ప్రవరాఖ్యుడిని కౌగలించుకోవడానికి ప్రయత్నించింది. ఆమెకు దూరంగా తప్పుకోవడానికి ప్రవరాఖ్యుడు ప్రయత్నించడంతో ఆమె నేలమీద పడిపోయింది. అలా పడడానికి కారణం తన తొందరపాటే అని వరూధినికి తెలిసినా ప్రవరాఖ్యుడిని చూపిస్తూ-

పాటునకింతులోర్తురే కృపా రహితాత్మక నీవు త్రోవ
ఇచ్చోట ఇచ్చోట ఇచ్చోట భవన్నఖాంకురము సోకె .....
కనుంగొనుము  అకట! 
వనిత తనంతట తాను వలచి వచ్చిన చుల్కన గాదె ఏరికిన్!!

 అంటూ తనమీద జాలి కలిగేలా జాలి జాలిగా ఏడ్చింది వరూధిని. ఇక్కడ ఎంతో ప్రసిద్ధిగాంచిన పెద్దనగారి పద్యంలోని మొదటి రెండు పాదాలు మాత్రం తీసుకున్నారు. వరూధిని ఎలా ఏడ్చిందో చెప్పే ఆ పాదాలకు బదులుగా సంభాషణకి అనుగుణమైన వాక్యాలు చేర్చారు సినారె.  ఆ పద్యంలో  నీ గోళ్ళు గుచ్చుకున్నాయి ఇక్కడ అంటూ ప్రవరుడికి వరూధిని     ఇచ్చోట అని ఒకసారి చూపిస్తే  సినారె గారి వరూధిని ఓ మూడు సార్లు ఇచ్చోట ఇచ్చోట ఇచ్చోట అంటూ చూపిస్తుంది. నాటకం కాబట్టి పాత్రకి జీవం పోసాయి ఈ మూడుసార్లు పలికిన మాటలు.

  
పెద్దన ముందు పద్యాలలో అన్న మాటలని ఇక్కడ కలిపి, అకట వనిత తనంతటతాను వలచి వస్తే  ఎవరికైనా చులకనే కదా అని ఇక్కడే వరూధినితో అనిపించారు.

ఇల్లు చేరే దారి చెబుతుందేమో అని ఆశగా ఆమె వద్దకి చేరిన ప్రవరాఖ్యుడికి అర్థమైపోయింది. ఇక ఆమె నుంచి తనకు ఏసహాయము రాదని. అందుకే ఆమె కల్లబొల్లి ఏడ్పులను వినిపించుకోలేదు. నిత్యం తాను ఆరాధించే దైవం, త్రికాలాలలోను తాను ఆహవం చేసే అగ్నికి అధిపతి అగ్ని దేవుడిని ప్రార్థించాడు.

దాన జపాగ్ని హోత్ర పరతంత్రుడనేని భవత్పదాంబుజ
ధ్యానరతుండ నేనిఁ పరదార ధనాదుల గోరనేని స
న్మానము తోడ నన్ను సదనంబున నిల్పు మినుండు పశ్చిమాం
భోనిధిలోన గ్రుంగకయ మున్న రయంబున హవ్య వాహనా
(ఇది పెద్దనగారి పద్యం)

అంటూ సాయంత్రం లోపల తనను ఇల్లు చేర్చమని ప్రార్థించాడు. అతని విన్నపాన్ని మన్నించి అగ్ని దేవుడు అతనిని అరుణాస్పద పురంలోని  నివాసానికి చేర్చాడు.ఇక్కడితో ప్రవరాఖ్యుడి కథ అయిపోయింది నిజానికి.
కానీ కాదు. అసలు కథ ఇంకా ఇప్పుడే మొదలైంది వరూధినికి.

"ఏనాటినుండో వరూధినిపై మక్కువ పడ్డ గంధర్వుడు( అతని పేరు కలి) ఈ అవకాశాన్ని  పురస్కరించుకుని  ప్రవరుడి రూపం దాల్చి వరూధిని వద్దకు వచ్చాడు. 
ఆ మాయా ప్రవరుని తిలకించి పులకాంకిత యైన వరూధిని "


"నీవేనా స్వామీ నీవేనా
ఇది నిజమేనా మరి కలలోనా "
అనుకుంటూ  మైకంలోంచి లేచింది వరూధిని.

"ఏలరా ఈ చలమేలరా, ఏలరా ఇక  నన్నేలరా
పాల వెన్నెల నురుగుల చెరసాలలో- మాలతీ లతా నికుంజాలలో
ఏలరా ఇకనైనా ఏలరా"
అంటూ ప్రవరుడిని బ్రతిమాలడం ప్రారంభించింది.
ఏలరా ఈ చలమేలరా  అనే ఈ వాక్యాలు మనకు జావళీగీతాలలో తరచు కనిపిస్తాయి. (చలము అంటే ఆలస్యం). ఇక్కడ సినారె ఏలరా అంటే ఎందుకురా అని ఒక అర్థంలో ఒకసారి, ఏలరా అంటే తనను ఏలుకోమని మరో అర్థంలోను చక్కగా వాడారు.

వరూధినిని కోరి వచ్చాడు మాయా ప్రవరుడు. అయినా వెంటనే వప్పుకుంటే తన సంగతి తెలుస్తుందేమో నని అనుమానించాడు కాబోలు. బెట్టు సాగించాడు ఆ మాయా ప్రవరుడు.

"నీ వెక్కడా  నేనెక్కడా
 భువి ఎక్కడా దివి ఎక్కడా
ఆ నింగికి ఈ నేలకు ముడి పడే దెట్టులా"
 అంటూ తనకి ఆమెకి ఉన్న అంతరాలను వివరించడానికి ప్రయత్నించాడు. 

"నీ కనులు కనికరించితే మనసు సమ్మతించితే
దివిని మరచి భువినే తలచేనురా
ఈ భువినే ఆ దివిగా తలచేనురా "
అంటూ తను ఈ భూలోకాన్నే తన స్వర్గలోకంగా ఊహించుకుని అతనితో గడపగలనని చెప్తుంది వరూధిని. అతని పై ఆమెకు గల ప్రేమకు నిదర్శనం ఈ మాటలు.

"గాలి తాకిడికే కందే నీ చెక్కిళ్ళూ
పూల తొక్కిడికే  బొబ్బలెక్కే అరికాళ్ళూ
ఇంతటి సుమకోమలివే అంతటి స్వర్గాలు వీడి
ఎటుల నిలువ గలవూ ఈ లోకంలో నరలోకంలో!!

అంటూ వరూధిని సౌందర్యాన్ని ప్రశంసిస్తాడు మాయా ప్రవరుడు. ప్రవరుడు దారికొస్తున్న సూచనలు కనిపించాయి వరూధినికి. మళ్ళీ మనసు మార్చుకొని వెళ్ళిపోతాడేమోనని భయపడింది. అందుకే

"నేను నీ దాననైనా చాలురా!!
 నీవు నావాడవైతే పదివేలురా !!

అంటూ అతడిని చేరింది. నీదాననైనా చాలురా అంటే ఇక్కడ వరూధిని ప్రవరుడికి తనని తాను సమర్పించుకుంటోందన్నమాట. నీవు నావాడవైతే పదివేలురా అంటే ప్రవరుడు కూడా పూర్తిగా వరూధిని పట్ల అనురక్తిని పెంచుకుని ఆమెకు తన మనస్ఫూర్తిగా తనని సమర్పించుకోవడం అన్నమాట. ఈ మాటలు చాలా చమత్కారంగా అనిపించారు వరూధినితో సినారె. ఆమెకు ప్రవరుడి పట్ల కలిగిన అనురాగాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తాయి ఈ మాటలు.

"నీ పద ధూళిని నిలిచిన నాడు 
నరకమైన అది నందనవనమేరా"
 అంటూ ఆ మాయాప్రవరుడిని తను ప్రేమించిన ప్రవరాఖ్యుడిగానే ఊహించి అతనికి తన జీవితాన్ని కానుకగా సమర్పించుకుంటుంది.

భిన్న లోకాలలో జీవిస్తున్న, భిన్న ప్రవృత్తులు కలిగి ఉన్న ఈ వరూధినీ ప్రవరాఖ్యుల ఇతివృత్తం మనుచరిత్రలోమను సంభవానికి కారణమైంది. వరూధిని గర్భం దాల్చగానే,  ఒకరోజు - తనకు పసరు రాసిన సిద్ధుడు కనిపించాడని, తనకోసం అందరూ ఎదురుచూస్తున్నారని, చూసి వస్తానని, అప్పుడప్పుడూ వస్తూ ఉంటానని చెప్పి మాయా ప్రవరుడు – ప్రవరాఖ్యుడిగానే నటించి వరూధిని నుంచి దూరమయ్యాడు. వరూధినికి ఎప్పటికీ అతను మాయారూపుడని తెలియనే తెలియదు. అప్సరస కావడం వలన నచ్చినవాడిని కోరుకోవడం ఆమెకు ధర్మమే. ఏకపత్నీ వ్రతం, సదాచారం,వైరాగ్యం ప్రవరుడి ధర్మం. అలాంటి ప్రవరుడిలోని అతిలోకసౌందర్యాన్ని చూసి మోహించి అతనినే  ఊహిస్తూ ఆమె జీవించడం వలన అతని ధర్మతేజపు  అంశ  స్వరోచి కుమారుడు మనువుగా రూపెత్తింది.

భక్తి వైరాగ్య సంపన్నుడిగా, విష్ణువును సాక్షాత్కరింపజేసుకున్న గొప్పభక్తుడిగా, సకల భువన రక్షాదక్షుడిగా, ధర్మ స్వరూపుడుగా మనువు గౌరవాలందాడు. మానవలోకంలోనే ఉన్నా మానవాతీతులుగా కనిపించే మనువులకు మూల పురుషుడు స్వారోచిష మనువు. ఈ మనుసంభవమే మనుచరిత్ర. ఆ సంభవానికి పూర్వగాథే ఈ వరూధినీ ప్రవరాఖ్య వృత్తాంతం.

రసాభాస కావలసిన గాథని, రసవత్తరమైన కథాంశంగా తీర్చిదిద్దిన పెద్దనగారి ఈ వృత్తాంతాన్ని ఇతివృత్తంగా తీసుకుని ఓ సాంఘిక చిత్రం కోసం అందమైన నృత్య నాటకంగా సరస సంభాషణలతో రసవత్తరంగా  తీర్చిదిద్దిన మన            సినారె – భళారే.

పాట రచన   సి. నారాయణరెడ్డి.

గానం          ఘంటసాల, సుశీల, ఎన్ .టి. రామారావు, వాణిశ్రీ,   
      ఈ అంతర్నాటకం రచన శ్రీ డా.        సి.నారాయణరెడ్డి.
  ఏ.పుండరీకాక్షయ్య నిర్మించిన ఈ చిత్రానికి దర్శకులు బి.వి. ప్రసాద్.