08 May 2011

కళారవీ !! పవీ !! కవీ!!



అంధురాలైన ఓ యువతి.
లోకంలో అందమైన దృశ్యాలెన్నో ఆమె చూడలేదు.
ఆమెని పెళ్ళాడిన ఓ యువకుడు ఆమెకి తన కళ్ళతో లోకాన్ని చూపించాలనుకున్నాడు.
మహా గొప్పసామ్రాజ్యమై వెలసి, కళలకు కాణాచి అయిన విజయనగరం నేడు శిథిలమయినా ఒకనాటి తన కళా వైభవాన్ని చాటుతూ నాటి శిల్పులు వెలయించిన రమణీయశిల్పకళా దీప్తులను ప్రదర్శిస్తూనే ఉంది. ఈ దృశ్యాలన్నీ చూస్తున్న యువకుడు తన కళ్ళతో తన భార్యకి ఆ లోకాన్ని చూపాలనుకున్నాడు. అప్పుడు పుట్టిన పాట....

శిలలపై శిల్పాలు చెక్కినారు...మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు..
అక్కడ తాను దర్శించిన అనుభవాన్ని భార్యకు వర్ణించి చెప్పి చివరకు-

కనులు లేవని నీవు కలత పడ వలదు
నాకనులు నీవిగా చేసుకొని చూడు........
అంటూ తన తోడుండగా కనులు లేకపోయినా బాధపడనక్కరలేదని, తామిద్దరూ ఒకటే అనే భావాన్ని ఆమెలో కలిగిస్తాడు.

ఈ పాట రచన ఆచార్య ఆత్రేయ. మంచి మనసులు చిత్రం కోసం 1962లో రచించిన పాట ఇది.
మళ్ళీ 1981 లో ఇలాంటి మరొక సందర్భానికి ఆత్రేయగారు ఒక పాట రాసారు.

తొలికోడి కూసింది సినిమా కోసం.
ఒక అంధురాలైన అమ్మాయి - లోకం చాలా అందమైనదని విన్నానని, ఆ అందాలను తను చూడలేకపోతున్నందుకు బాధ పడుతు ఉంటుంది. అప్పుడు లోకం రంగురంగులతో అందంగా ఉంటుందని అందరూ అంటూ ఉంటారు గానీ ఆ అందమైన లోకం వెనక దాగి ఉన్న చీకటి కోణాలు కూడా ఎన్నో ఉన్నాయని చెప్తూ లోకం నిజానికి ఆ అమ్మాయి అనుకున్నంత అందమైనది కాదు అని పాట రూపంలో మరొక అమ్మాయి ఇలా వర్ణిస్తుంది.

అందమైన లోకమనీ రంగు రంగులుంటాయని
అందరూ అంటుంటారు రామ రామా...
అంత అందమైంది కానేకాదు చెల్లెమ్మ
చెల్లెమ్మా... అందమైంది కానేకాదు చెల్లెమ్మా

సాహిత్య పరంగా ఎన్నో జీవితసత్యాలను అలవోకగా చెబుతూ సాగే పాటకు ఇది పల్లవి.

ఆకలి ఆశలు ఈ లోకానికి మూలమమ్మా
ఆకలికి అందముందా రామ రామా...
ఆశలకు అంతముందా చెప్పమ్మా చెల్లెమ్మా...

ప్రారంభంలోనే ఆకలి, ఆశ వీటికి లోకంలో ఎంత ప్రాధాన్యం ఉందో చెప్పారు. ఆకలికి అందముందా రామ రామ, ఆశలకు అంతముందా చెప్పమ్మా అనడంలో ఆ రెండిటినీ సఫలం చేసుకోవడమే జీవితాశయం అయినప్పుడు ఇక లోకంలో అందం ఉండడానికి, కనిపించడానికి అవకాశం ఎక్కడుంది ?

గడ్డిమేసి ఆవు పాలిస్తుంది
పాలు తాగి మనిషి విషమౌతాడు |
అది గడ్డి గొప్పతనమా..
ఇది పాల దోష గుణమా..
మనిషి చాలా దొడ్డాడమ్మా చెల్లెమ్మా
చెల్లెమ్మా... తెలివి మీరి చెడ్డాడమ్మా చిన్నమ్మా

గడ్డిలో ఏగొప్పదనమూ లేకపోయినా దానిని తిన్న ఆవు మంచి పోషకమైన పాలు ఇస్తుంది.కానీ ఆ పాలుతాగిన మనిషి హానిచేసే విషంలా ప్రవర్తిస్తున్నాడు. లోపం మనిషిలోనే ఉందని స్పష్టం అవుతోందన్నమాట. పుట్టుకతో మనిషి మంచివాడే అయినా తెలివి ఎక్కువయిపోయి ఇలా మారిపోతున్నాడేమోనని కవి విచారం.

ముద్దుగులాబీకి ముళ్ళుంటాయి
మెగలిపువ్వులోన నాగుంటాది
ఒక మెరుపు వెంట పిడుగూ...
ఒక మంచిలోన చెడుగూ...
లోకమంత ఇదే తీరు చెల్లెమ్మా
చెల్లెమ్మా... లోతుకెళ్తే కథే వేరు చిట్టెమ్మా

ముద్దుగా స్నిగ్థంగా కనిపించే గులాబీ, తాకితే ముళ్ళు గుచ్చుకుంటాయి. కమ్మని వాసనతో మైమరపించే మొగలి పొద దగ్గరకు చేరుకోలేం...నాగుపాములందులో ఉంటాయి. తటాలున మెరిసే మెరుపుతీగ గొప్పదనాన్ని గుర్తించే లోపలే వెంటనే వినిపించే పిడుగు శబ్దం గుండెని ఝల్లనిపిస్తుంది. ఎంతో మంచివి, అందమైనవి అనుకున్న వాటి వెనుక ఇలాంటి చెడు లక్షణాలు కనిపించడమే లోకం స్వభావం. అందమైనదంతా మంచిదని అనుకోవడం ఓ అమాయకత్వం. లోతుగా ఆలోచిస్తే స్ఫురించే తత్వం ఇదే.

డబ్బు పుట్టి మనిషీ చచ్చాడమ్మా
పేదవాడు నాడే పుట్టాడమ్మా
ఆ ఉన్నవాడు తినడూ...
ఈ పేదను తిననివ్వడూ...
కళ్లులేని భాగ్యశాలి నువ్వమ్మా
ఈ లోకం కుళ్లు నీవు చూడలేవు చెల్లెమ్మా

'డబ్బుకు లోకం దాసోహం' అని మన సామెత. లోకంలో డబ్బు పుట్టిన తర్వాత మనిషిలో మానవత్వం నశించింది. ఆ విధంగా మనిషి చచ్చాడు. తాను సృష్టించుకున్న డబ్బు చేతిలో తానే కీలుబొమ్మ అయ్యాడు. అలా డబ్బు సంపాదించుకున్న వాడే మనిషిలా గుర్తించబడుతున్నాడు. అక్కడే మనిషిగా పుట్టినా, మనిషిగా గుర్తింపబడని పేదవాడు పుట్టాడు. ఆ గొప్పవాడు తన దగ్గర ఉన్న అంత డబ్బును తాను తినలేడు, అయినాగానీ కనీసం ఇతరులకు పెట్టడు, తిననివ్వడు. గోతికాడ గుంటనక్క తీరు డబ్బున్నవాడి వ్యవహారం.

ఇదీ ఈ లోకం తీరు. ఇంత కుళ్ళు, ఇన్ని కుతంత్రాలతో నిండి ఉన్న లోకాన్ని చూడకపోతే బాధపడవలసినదేం లేదు. నిజానికి అలా చూపులేకపోవడమే ఒక భాగ్యం అనుకొని సంతోషించవచ్చు. లోకం చాలా అందమైనది అనే భ్రమ అయినా మిగులుతుంది.

పాటలో ఇలా లోకం తీరు చెప్పడానికి కవి వాడుకున్న పాత్ర ఒక అక్క. అందువల్ల ఆమె తను చూసిన లోకం తీరును చిన్నదైన తన చెల్లెలికి చెప్పడంలో ఔచిత్యం కనిపిస్తుంది.

చెల్లెమ్మా, చిన్నమ్మా, చిట్టెమ్మా, చెప్పమ్మా, పిచ్చమ్మా- అంటూ మార్చి మార్చి వాడిన పదాలు, కేవలం అంత్యప్రాస కోసం కాక, ఆ నీతి చెబుతున్న అక్కకి చెల్లెలిమీద గల ఆప్యాయతని, అనురాగాన్ని ధ్వనిస్తూ ఉంటాయి.

లయాత్మకమైన వాక్య విన్యాసం ఈ గీతంలో కనిపిస్తుంది.

ఆకలికి అందముందా - ఆశలకు అంతముందా
మనిషి చాలా దొడ్డాడు (దొడ్డవాడు-మంచివాడు అని అర్థంలో) - తెలివిమీరి చెడ్డాడు
మెరుపు వెంట పిడుగు - మంచి వెనక చెడుగు
లోకమంతా ఇదే తీరు - లోతుకెళితే కథే వేరు
ఈ వాక్యాలలో ఒక లయ, తూగు కనిపిస్తాయి.

'డబ్బుపుట్టి మనిషి చచ్చాడు, పేదవాడు నాడు పుట్టాడు' అనే వాక్యంలో చావు, పుట్టుక అనే రెండు వ్యతిరేకార్థ పదాలు వాడుతూ మనుషుల మధ్య 'డబ్బు' అనే వస్తువు మానవత్వం నశించిపోవడానికి, మనుషులందరూ పుట్టుకతో ఒకేలాంటి లక్షణాలున్నా ఉన్నవాడు, లేనివాడు అనే పేరుతో విభజించడానికి ఎలా కారణమైందో ధ్వనింపచేసారు.

భాష మీద, అది ధ్వనింపచేసే భావం మీద ఎంతో పట్టు ఉన్న కవికి కానీ పట్టుబడని పదార్థ ప్రయోగాలు ఇవి. సినిమా కోసం ఈ సాహిత్యాన్ని స్వరపరచినది శ్రీ ఎం.ఎస్.విశ్వనాథ్ గారు.
గీతాన్ని మధురంగా, కవిహృదయాన్ని అర్థం చేసుకొని భావగర్భితంగా ఆలపించినది శ్రీమతి ఎస్. జానకి గారు.


లోకంలో అందాలు ఇన్ని ఉన్నాయే చూడలేకపోతున్నామని బాధ పడేలా అలనాడు మంచి మనసులు చిత్రం కోసం ఆ పాట రాసి-
రంగు రంగుల లోకంలో ఎన్నో అందాలున్నాయి, చూడలేకపోతున్నామని బాధ పడేవారికి లోకంలో రంగుల నీడచాటున దాగి ఉన్న నిజాలను విప్పిచూపి, మేడిపండులా మెరిసే సంఘం గుట్టును విప్పి చూపిస్తూ, చూపు లేకపోవడాన్నే అదృష్టమేమో అనిపించేలా ఇంకో పాట రాసి-

కవి కలం కత్తికి రెండు వేపులా పదునుందని నిరూపించారు ఆచార్య ఆత్రేయ.