07 October 2013

తేవారం - తిరుమురై - తమిళ సాహిత్యం

 తమిళదేశంలో శైవమత సాహిత్యంలో అతి పవిత్రమైనదిగా, వేదాలతో సమంగా భావింపబడేది - తిరుమురై. 
ఇది మొత్తం పన్నెండు భాగాల సంకలనం.  నాలుగు పాదాలతో కూడిన వృత్తాలుగా ఇందులో ఛందస్సు కూర్చబడింది. పదవశతాబ్దంలో రాజరాజ చోళుడు పరిపాలించిన కాలంలో ఈ సంకలనం కూర్చడం జరిగింది. వీటిలో మొదటి ఏడు భాగాలను తేవారం అంటారు. ఈ ఏడు భాగాలు ముగ్గురు ప్రముఖ కవులరచన. 

ఏడవ శతాబ్దికి చెందిన కవులైన  సంబందర్, అప్పార్ ( తిరునావుక్కరసార్), సుందరార్ (సుందరమూర్తి) అనే ముగ్గురు నయనార్లకి   అంకితం చేయబడినది ఈ తేవారం. శివశక్తి గురించి, శివ పంచాక్షరి గొప్పదనం గురించి  వర్ణిస్తుంది ఈ సాహిత్యం.   బౌద్ధ జైన మతాలు ఉచ్ఛదశలో ఉన్నదశలో ఆ మత ప్రభావం నుంచి  ప్రజలను మళ్ళించి, వైదిక మతాన్ని  పునరుద్ధరించడం కోసం ఈ  శివకవులు చేసిన ప్రయత్నమే  ఈ సాహిత్యం. 

తేవారం అన్న పేరు తొలిసారిగా ఏడవ శతాబ్లిలో,  మరోసారి పదవ శతాబ్దిలో రాజరాజ చోళుడి కాలంలో చిదంబరం శివాలయంలో  శిథిల దశలో తాళపత్రాలరూపంలో  ఆ సాహిత్యం దొరకడం, ఆగమ శాస్త్రవిధి విధానాలలో భాగంగా శివుడితో సమానంగా శివభక్తుల విగ్రహాలను ప్రతిష్ఠించడం అనే మార్పులు జరిగినప్పుడు, తిరిగి పదమూడవ శతాబ్లిలో  శక్తి పీఠాలు, మఠాల ద్వారా శైవమత ప్రచారానికి ఈ  తేవారంలోని సాహిత్యం ఉపయోగించడం  ఇలా చరిత్రలో మూడు దశలలో శైవమతానికి సంబంధించి ఈ తేవారం ప్రసక్తి కనిపిస్తుంది. 

తేవారం లోని మొదటి మూడు భాగాలు సంబంధార్, తరువాత మూడు భాగాలను అప్పార్(తిరునావుక్కరుసార్), ఏడవదాన్ని సుందరార్(సుందరమూర్తి) రచించారు. "అప్పార్ నాకోసం రాసాడు. సంబందార్ తనకోసం పాడాడు. సుందరార్ ఆడవాళ్ళకోసం పాడాడు " - అని తమిళం లో ఓ సామెత.  అప్పార్, సంబందార్ ఏడవ శతాబ్దికి చెందినవారు కాగా, సుందరార్ ఎనిమిదవ శతాబ్దికి చెందినవాడు. జైన, బౌద్ధ మతాల ప్రాచుర్యాన్ని తగ్గించడానికి శైవమతాన్ని ప్రచారం చేయడానికి ఈ కవులు చాలా కృషి చేసారు. పల్లవరాజుల కాలంలో వీరంతా వైష్ణవ, బౌద్ధ, జైన మత సిద్ధాంతాలను ఖండిస్తూ దేశమంతా విస్తృతమైన పర్యటన చేసారు.  అనేక మత చర్చలు చేసి ఇతరమతస్థుల సిద్ధాంతాలను ఖండన మండనాలు చేసి ఓడించారు. వీరి సాహిత్యంలోనే తమిళ భాష ప్రాచీనతను నిరూపించే సంగం సాహిత్య ప్రస్తావన కనిపిస్తోంది. తమిళదేశంలోని ప్రాంతాలతో ఇతర ఆసియా దేశ వాసులకు జరిగిన వ్యాపార లావాదేవీల గురించి కూడా  ఈ తేవారంలో వర్ణించబడింది. ఆవిధంగా ఇది చరిత్రని రికార్డు చేసిన సాహిత్యంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఏడవ శతాబ్లిలో రచించబడిన ఈ తమిళ సాహిత్యం అక్కడక్కడా ప్రాసంగికంగా మాత్రం ఉంటూ పదకొండవ  శతాబ్లిలో పూర్తి స్థాయిలో  వెలికి వచ్చి విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ఈ నయనార్ల కథలలో చాలావరకు అన్నిటా కనిపించే అంశాలు ఇతరమతావలంబికులను, శైవమతాన్ని అవలంబించేలా చేయడం, చనిపోయిన వారిని కూడా తమ శివభక్తి శక్తితో బ్రతికించడం, చివరగా శివసాయుజ్యాన్ని పొందడం.

సంబంధార్ సిరికళిలో బ్రాహ్మణకుటుంబంలో జన్మించాడు. మూడేళ్ళపాపడుగా ఉన్నప్పుడు  పార్వతీదేవి స్తన్యపానం చేసాడని తొలి వేదాన్ని అప్పుడే ఆలపించాడని చెప్తారు. పాండ్యదేశపు రాణి కోరికమేరకు దక్షిణాదికి వెళ్ళి జైనులను మతచర్చలో ఓడించాడుట. కానీ 16 ఏళ్ళచిన్న వయసులో ఇతను మరణించాడు. మరణిస్తాడని ముందుగానే తెలిసి వివాహం వద్దని అన్నాడుట. కానీ బలవంతంగా వివాహం చేయడంతో వెంటనే మరణించాడని కథనం.  అప్పార్ కవికి సమకాలికుడు ఇతను.

సంబంధార్ కి సంబంధించిన సమాచారం ఎక్కువగా పెరియపురాణంలో లభిస్తుంది. పెరియపురాణం అనేది పదకొండవ శతాబ్దినాటి తమిళ గ్రంధం. తిరుమురైలోని ఆఖరు భాగం ఇది.

అప్పార్ – ఇతనినే తిరునావుక్కరసార్ (పవిత్రమైన ఉపన్యాసాలు ఇచ్చేవాడు) అంటారు. అసలు పేరు మరుల్ నీకియార్.  ఇతను తిరువామ్యూర్ కి చెందిన ఏడవశతాబ్దినాటి కవి. కడలూరు జిల్లాకి చెందినవాడు. అతను బాలుడిగా ఉండగా జైనమతంపై ఆసక్తితో వారి స్మృతులన్నీ చదివాడు. ఇంటికి దూరంగా పాటలీపుత్రం వెళ్ళి జైన స్థావరాలలో ఉండి  జైన స్మృతులలో నిష్ణాతుడయి ధర్మసేనుడిగా  పిలవబడ్డాడు. అతని సోదరి  తమ్ముడు జైనమతాన్ని అవలంబించడం భరించలేక శివాలయంలో తపస్సు చేసింది. తినునావుక్కరసుకు బాగా జబ్బు చేసింది. అక్క కోరికమేరకు శివుడిని శరణు కోరి శైవమతాన్ని అవలంబించాడు. కడలూరుకు ప్రభువైన జైనరాజు కడవుడు అతన్ని  ఎన్నో హింసలు పెట్టాడు. అయినా అతనికి శివభక్తినుండి  మనస్సు   చెదరలేదు. ఆఖరుకి మెడకి బండరాయి కట్టి సముద్రంలో పడేసారు రాజభటులు. కానీ దైవ సహాయంతో ఒడ్డుకు చేరాడు. శివభక్తి గొప్పదనాన్ని నిరూపించే తిరునావుక్కరసు కధ ఇది. పెరియపురాణంలోని కొన్ని పద్యాలలో అప్పార్ చరిత్ర ఉంది.  అప్పార్  సత్యాన్వేషణ చేస్తూ శైవమతం వైపు ఆకర్షితుడై పల్లవరాజు మహేంద్రవర్మును శైవమతం అవలంబించేలాగ చేసాడు. ఈ మహేంద్రవర్మ శైవమతం నుండి జైనమతానికి మారాడు. అతన్ని తిరిగి శైవంలోకి మార్చడానికి అప్పార్ కారణమయ్యాడు. ఆవిధంగా శైవమతంలోకి చేరాక వేలకొలది జైనులని చంపించాడు  మహేంద్రవర్మ అని చరిత్ర చెబుతోంది.  సంబందార్  అతనిని అప్పా అనిపిలవడం తో అప్పార్ అనే పేరుతో కూడా ప్రసిద్ధుడయినాడుట. మదురైలో 49వేల పద్యాలతో శివుణ్ణి అర్చించాడు. కొన్ని పద్యాలలో వర్ణించబడిన ప్రకారం అప్పార్  కైలాసానికి వెళ్ళి శివపార్వతుల నాట్యం చూసి తరించాడని తెలుస్తోంది. సంబందార్ చాలా చిన్నవయసులోనే మరణించాడని, అప్పార్ 80 సంవత్సరాలు జీవించాడని తెలుస్తోంది. లౌకిక జీవనంలోనే శివుడిని  చేరడానికి ఎన్నో మార్గాలు చెప్పాడు అప్పార్. "దేహాన్ని శివాలయంగా భావించి, ఆత్మనే శివలింగంగా ఊహించి సత్యం, ప్రేమ అనే జలాలతో ఆ శివుణ్ణి అర్చించమన్నాడు. ఏకాగ్రతతో శివపంచాక్షరిని సాధన చేస్తే శివసాయుజ్యం దొరుకుతుందన్నాడు."

సుందరార్ లేక సుందరమూర్తి  8వ శతాబ్దివాడు. నంబి అరురార్ అసలుపేరు. సుందరమూర్తి అని కూడా అతనిని సంబోధిస్తారు.  తిరునవలూర్ లో గొప్ప సదాచారపరాయణుల ఇంట జన్మించాడు. శివనామస్మరణ మధ్యే పెరిగాడు.. నవవిధ భక్తి మార్గాలలో సఖ్యభక్తి అంటే  భగవంతుడిని స్నేహితుడిగా ఆరాధించడం కూడా ఒకమార్గం. సుందరార్ శివుడిని చెలికాడుగా భావించాడు. తనకు  ఏంకావాలన్నా, ఏ కష్టం సుఖం వచ్చినా ఆ ఈశ్వరుడిని స్నేహితుడిగా భావించి  అన్నీ అతన్నే అడిగేవాడు. ఇతను కూడా పద్ధెనిమిది సంవత్సరాలు మాత్రమే జీవించాడు.

నయనార్ లు అందరూ శివభక్తులో తరించినవారే. వారందరికీ వారి లౌకికజీవనంలో ఎన్నో మహిమలు జరిగాయి. వారు ఎన్నో పారలౌకికమైన అనుభవాలు పొందారని ఈశ్వర కటాక్షం పూర్తిగా పొందినవారని ఇలా వారిగురించి ఎన్నో కధలు ఈ తిరుమురైలో పారాయణ చేస్తారు. వాటి ప్రకారం ఈ సుందరార్ కథలో  సుందరార్  పూర్వజన్మలో  కూడా గొప్ప శివభక్తుడు. పాలసముద్రాన్ని దేవతలు రాక్షసులు చిలికినప్పుడు అందులోంచి హాలాహలం అనే విషం ప్రభవించి లోకాలను కల్లోల పరిచింది. దాన్ని శివుడు తీసుకుని కంఠంలో దాచుకుని లోకాలను రక్షించాడు కదా. ఈ సుందరార్ పూర్వ జన్మలో ఆ శివుడికి హాలాహలాన్ని అలా అందుకుని శివుడికి సమర్పించాడుట. అందుకని అతనిని ఆలాల సుందరార్ అని పేరు. ఈ మానవజన్మలోని నంబి అరురారే  ఆ ఆలాల(హాలాహల)సుందరార్ అన్నమాట.కైలాసంలో శివుడికి సేవకుడిగా ఉన్న సుందరార్ ఓసారి పార్వతీదేవి చెలికత్తెల సౌందర్యం చూసి చలించడం వలన ఈ మానవజన్మ ఎత్తవలసి వచ్చిందని కథ. శివభక్తిని చాటించి ప్రజలకి  ముక్తి కలిగించడమే ఈ మానవ జన్మ లక్ష్యం అనీ దాన్ని సుందరార్ సాధించాడని భక్తులు చెప్పుకుంటారు. సుందరార్ కథ ద్వారా మనిషికి మోహం అనేది అదుపులో లేకుంటే కలిగే ఫలితాలు,నశించిపోయే నైతిక విలువలు గురించి తెలుస్తుంది. అయితే సద్గురువులను ఆశ్రయించి వారి వెంటనే ఉంటూ పవిత్రమైన క్షేత్రాలను దర్శించి ,శివమూర్తిని  ఆరాధించినవారికి అన్నీ లభిస్తాయని చేసిన పాపం పోతుందని  చెపుతుంది ఈ తేవారం లోని మూడవనయనార్  సుందరమూర్తి కథ.
అప్పార్, సంబందార్, సుందరమూర్తి, మాణిక్యవాసర్
రాజరాజ చోళుడు తేవారం గురించి విని వీటిని సేకరించమని నంబియండర్ నంబి అనే పూజారిని కోరాడుట. దైవ నిర్ణయం వల్ల వెంటనే చిదంబరంలోని శివాలయంలో జీర్ణావస్థలో ఉన్న తాళ ప్రతులు దొరికాయట. ఆ ఆలయ బ్రాహ్మణులు వ్యతిరేకించినా రాజరాజు ఈ కవుల విగ్రహాలను తయారు చేయించి శివాలయాలలో ప్రతిష్టించాడుట.

 
ప్రసిద్ధ శివాలయాలలో కనిపించే  63 మంది  నయనార్ల విగ్రహాలు

 అందుకే రాజరాజ చోళుడిని తిరుమరై ని రక్షించిన వాడుగా- తిరుమురై కంద చోళన్ గా పేరు పొందాడు. నంబి మొదటి ఏడుభాగాలలో ఈ ముగ్గురు కవులు రచించిన శ్లోకాలనుకూర్చాడు. మాణిక్య వాచగర్ రచించిన  తిరుకోవయార్, తిరువాక్కం ను ఎనిమిదవభాగంలో కూర్చాడు.. తొమ్మిదిమంది నయనార్లు కూర్చిన శ్లోకాలను తొమ్మిదవభాగంగాను, తిరుమందిరం, తిరుమూలార్ లను పదవభాగంగాను, తిరుతోట్టనార్ తిరువందతి తోపాటు తాను కూర్చిన శ్లోకాలను పదకొండవ భాగంగా కూర్చాడు. మొదటి ఏడు భాగాలు తేవారం గా ప్రసిద్ధి పొందాయి. పెరియపురాణం పన్నెండవ భాగం.

పెరియపురాణం  - 63 మంది శివభక్తులైన  నయనార్ల చరిత్రను గురించి చెబుతుంది పెరియపురాణం (తిరుత్తొండార్ పురాణం అని కూడా పేరు). ఇది  పంచమ వేదంగా భావించబడుతోంది. భగవంతుడిని చేరడానికి నిష్కామకర్మతో కూడిన భక్తి మార్గమే ఏకైక సాధనమని నమ్మిన భక్తులు నయనార్లు. ఈ నయనార్లలో తమిళదేశానికి చెందిన భక్తులే కాక తెలుగు వారు కూడా ఉండడం విశేషం.  మనందరికీ తెలిసిన భక్త కన్నప్ప లేక తిన్నడు అనే శివభక్తుడు ఈ 63 మంది నయనార్లలో  ఒక భక్తుడు.  అన్ని శివాలయాలలోను ఈ కన్నప్ప శిల్పాలు గోపురాలమీద  గోడలమీద కనిపిస్తాయి. వేదాలు యోగాలు శాస్త్రాలు ఏమీ తెలియకపోయినా శివుడికి తమ ఆత్మని అర్పించి సంపూర్ణమైన శరణాగతిని ప్రదర్శించిన గొప్ప శివభక్తుడు కన్నప్ప. 
భక్త కన్నప్ప (తిన్నడు)
ఈ విధంగా  పెరియపురాణంలో ప్రస్తావించబడిన నయనార్లందరూ చారిత్రక వ్యక్తులే కావడం ఈ గ్రంధం ప్రాశస్త్యాన్ని అధికం చేసింది. వివిధ కాలాలలో వివిధ ప్రాంతాలకు, వివిధ వృత్తులకు చెందిన ఈ నయనార్లు శివభక్తి అనే ఏకసూత్రంలో ఇమిడిపోయిన మణి పూసలు.

 రెండవ కులోత్తుంగ చోళుడి మనసును జైన మతం నుంచి మళ్ళించడానికి అతని ఆస్థానంలోని కవి, గొప్ప శివభక్తుడు సెక్కిజర్ పెరియపురాణం రచన ద్వారా శివతత్వాన్ని రాజుకి బోధించడానికి ఈ పురాణ రచనకు పూనుకున్నాడని, చిదంబరం దేవాలయంలోని వేయిస్తంభాల మందిరంలో అతను ఈ రచన ప్రారంభించాడని చెప్పబడుతోంది. కేవలం శివభక్తుల కథలను, ముక్తిని గురించి మాత్రమే కాక చోళ సామ్రాజ్యపు మహా వైభవాన్ని వర్ణించిన రచనగా, సాహిత్య రచనలో ఉన్నత శిఖరాలను అందుకున్న కృతిగా ఈ పెరియపురాణం ప్రఖ్యాతి పొందింది. 
చరిత్ర కాలంనాటి శివాలయాలు చిదంబరం, తంజావూరు, శ్రీ కాళహస్తి, మధురై, కపాలీశ్వర కోవెల మొదలైన పెద్ద శైవాలయాలన్నిటిలోనూ ఈ 63 మంది నయనార్ల శిల్పాలు కొలువుతీరి భక్తులకు ఆరాధనీయమయ్యాయి. వీటికోసం ప్రత్యేక మండపాలు ఏర్పాటు చేయబడి ఉంటాయి. ప్రతి సంవత్సరం ఫాల్గుణమాసం (పంగుణి మాసం తమిళంలో) అంటే శివరాత్రి పర్వదినాన ఈ 63 మంది నయనార్ల ఉత్సవ విగ్రహాలను ఆలయమాడవీధులలో ఊరేగిస్తారు చాలా శివాలయాలలో. చెన్నైలోని కపాలీశ్వర దేవాలయంలో ఈ ఊరేగింపు ఘనంగా చేస్తారు. 



600 సంవత్సరాలనాటి శైవమతానికి సంబంధించిన మతపరమైన, తాత్త్వికచింతనతో పాటుగా తమిళ సాహిత్య ప్రస్థానాన్ని తెలియజేస్తుంది తిరుమురై. తిరుమురై లోని మొదటి ఏడు భాగాలు తేవారం పేరుతో పిలవబడతాయి. తేవారంలోని  ఈ గీతాలు తమిళనాట శివాలయాల్లో మహా నైవేద్యం సమర్పించాక సామూహికంగా గానం చేసే సంప్రదాయం ఉంది. తేవారం ప్రధానంగా సంబంధార్, అప్పార్, సుందరార్ అనే ముగ్గురు  కవిత్రయం కూర్చిన సాహిత్యం.   శివభక్తిపరులకి జీవితంలో ఎన్ని అలౌకిక అనుభవాలు కలుగుతాయో వివరిస్తూ సాగే  ఈ         తేవారం, పెరియపురాణంలతో కూడిన తిరుమురై  కేవలం  శివతత్త్వాన్ని, మహాత్మ్యమునే  కాక ఆయా కాలాల చారిత్రక అంశాలను, మానవ సంస్కృతీ విశేషాలను ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప రచనలు.


ఆనాటి చారిత్రక, తాత్విక చింతనలకి దర్పణం.వైష్ణవులకి నాలాయిర దివ్య ప్రబంధం దక్షిణ వేదంగా ఎలా ఆరాధనీయమో శైవులకి ఈ తిరుమురై  అంతే ఆరాధనీయం. 600 సంవత్సరాల దక్షిణ భారతదేశపు ప్రజల మత, తాత్త్విక, సాహిత్య ప్రస్థానాన్ని ముందు తరాలకు తెలియజేసే గొప్ప రచన  తిరుమురై. 

17 April 2013

"వరూధినీ ప్రవరాఖ్య "- భళారె !! మన సినారె !!



అభినవ ఆంధ్ర భోజుడు శ్రీ కృష్ణ దేవరాయల ఆస్థానంలోని కవులను అష్ట దిగ్గజాలు అంటారు. అందులో ముఖ్యమైన కవి దిగ్గజం అల్లసాని పెద్దన. ప్రబంధం అనే సాహిత్య ప్రక్రియకి పాదులు వేసినవాడు అల్లసాని పెద్దను. స్వారోచిష మనుసంభవము అనే కథను గొప్ప ప్రబంధంగా తీర్చిదిద్దాడు. పెద్దనతో ప్రారంభమైన ఈ ప్రక్రియ కనీసం రెండు వందల సంవత్సరాల వరకు సాహిత్యంలో ముఖ్యమైన పాత్ర వహించింది.

మారన  రచించిన "మార్కండేయపురాణం"  నుంచి పెద్దన మనుచరిత్రము  కథా వస్తువును తీసుకున్నాడు. దానికి స్వకపోల కల్పనలతో, వర్ణనలతో విస్తరింపచేసి ప్రబంధానికి ఉండవలసిన సర్వ లక్షణాలను సమన్వితం చేసి తరువాతి ప్రబంధ కవులకు మార్గ దర్శకుడయ్యాడు.


ప్రవరుడు అనే ఆఖ్య అంటే పేరు గలవాడు, ప్రవరాఖ్యుడు. ప్రవరాఖ్యుడు అనే పదం  పరస్త్రీల వైపు కన్నెత్తి   కూడా  చూడనివాడు అని తెలుగు జాతీయంగా స్థిరపడిపోయింది. వరూధినీ ప్రవరాఖ్య వృత్తాంతం అంతగా ఆంధ్రసీమకు పరిచయం కావడానికి కారణం పెద్దన గారి మనుచరిత్ర కావ్యం. ఈ కావ్యంలో మొత్తం ఆరు ఆశ్వాసాలు ఉండగా అందులో మూడు ఆశ్వాసాల వరకూ పూర్తిగా వరూధినీ ప్రవరాఖ్యుల  వృత్తాంతమే ఉంటుంది. సర్వలక్షణ శోభితుడైన ధర్మవీరుడు మనువు అతని జన్మకి కారణంగా ఈ వరూధినీ ప్రవరాఖ్యుల వృత్తాంతం చెప్పబడుతుంది.

వరూధిని ప్రవరాఖ్యుడి అతిలోక సౌందర్యం చూసి మోహిస్తుంది.  కానీ ధర్మ నిష్ఠ కలిగిన అతను ఆమెను  తిరస్కరించి వెళ్ళిపోతాడు. ఆమెపై ఎప్పటినుండో కన్నువేసిన కలి అనే ఓ గంధర్వుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మాయా రూపం ధరించి ప్రవరుడిగా ఆమె ముందు నిలు స్తాడు. అతను నిజంగా ప్రవరాఖ్యుడే అనుకుని అతని షరతులకు అంగీకరించి అతనిని వివాహం చేసుకుంటుంది వరూధిని.  గర్భవతి అయిన వరూధిని తన  చేసిన మోసాన్ని గ్రహించకముందే అక్కడినుంచి తప్పుకుంటాడు మాయా ప్రవరుడు. వరూధినికి ఎప్పటికీ తెలియని నిజం ఏమంటే తను వివాహమాడినదీ, పుత్రుడిని కనబోతున్నదీ ఓ మాయా ప్రవరుడికి అని. ఆమెకు పుట్టినవాడే స్వరోచి. అతని కుమారుడే స్వారోచిషుడు మనువు.

ప్రవరుడిని ఊహిస్తూ వరూధిని గంధర్వుడితో  జీవించడం వల్ల స్వరోచికి శాంతగుణ ప్రధానుడై, భక్తి వైరాగ్యసంపన్నుడైన కుమారుడిగా స్వారోచిష మనువు కలిగాడు. ప్రవరుడిలోని ధర్మవీరోత్సాహం ప్రవరుడి తేజస్సు స్వారోచిషుడిలో కలగడానికి ఈ వరూధినీ ప్రవరాఖ్యుల వృత్తాంతమే కారణమైంది కనుక పెద్దన ఈ కథకు ఇంత ప్రాధాన్యం ఇచ్చారని విమర్శకులు అంటారు.

ఇంత గొప్ప కావ్యంలోని ఇంత ప్రధానమైన కధని,. అందులోను మూడు ఆశ్వాసముల పైన రచించబడిన కథని ఓ సినిమాలో కేవలం ఓ పదిహేను  నిముషాల వ్యవథిలో చెప్పాలి అంటే అది ఎంత గొప్ప సాహసం. అటువంటి సాహసం చేయడానికి ఆ కవికి కవిత్వం పై ఎంత పట్టు ఉండాలి?! మూలకావ్యంలోని అంశాలను వాటి సౌందర్యాన్ని, పాత్రల సజీవ లక్షణాలను కాపాడుతూ సంభాషణలు గేయరూపంలోకి,  మాటలరూపంలోకి  మార్చాలంటే   ఎంత నిగ్రహం ఉండాలి?!

అల్లసాని వారి అల్లిక జిగిబిగి అని పేరు. అటువంటి కవి  పద్యాలను  సందర్భోచితంగా ఉపయోగిస్తూ, సినిమా సంగీతానికి అనుగుణంగా పదాలను మార్చుతూ, అందరికీ అర్థమయ్యే రీతిలో పాడుకునే పాటగా రాసి  శభాష్ అనిపించుకున్న  ఆ గొప్పదనం ఎవరిది?!


ఇంకెవరిది.... సాహిత్యంలోని అన్ని ప్రక్రియలలోను అత్యంత ప్రతిభాపాటవాలను ప్రదర్శించి కవిగా, విమర్శకుడిగా, ఆచార్యుడిగా విభిన్నమైన పదవులను నిర్వహించి దక్షుడిగా ఇంటగెలిచి, 

విశ్వంభరతో జ్ఞాన పీఠ్ బహుమతిని అందుకుని రచ్చగెలిచి, తెలుగు గౌరవాన్ని ఇనుమడింపజేసిన సింగిరెడ్డి నారాయణరెడ్డి గారిదే.... అవును!! అతనే సినారె.

మనుషుల్లో దేవుడు(1974) అనే చిత్రంలో నాయికా నాయక పాత్రలు(ఎన్. టి. ఆర్. వాణిశ్రీ)  ఓ అంతర్నాటకం  ప్రదర్శించే సందర్భంలో పాట రాయడానికి  ఈ వరూధినీ ప్రవరాఖ్యుల వృత్తాంతాన్ని నాటకానికి వస్తువుగా తీసుకున్నారు సినారె. అన్ని వందల పద్యాలలో పెద్దనగారు చెప్పిన కథనంతా కథలో ప్రముఖమైన ప్రచారం లో ఉన్న రెండు మూడు పద్యాలను మాత్రం ఉంచి తక్కినదంతా  గేయాత్మకశైలిలో తన సంభాషణలు జోడించారు.


వరణానదీ తీరంలో అరుణాస్పదం అనే పురంలో ప్రవరుడు అనే పేరు గల బ్రాహ్మణయువకుడు ఉండేవాడు. అతను నిత్యాగ్ని హోత్రుడు, నిరతాన్నదాత. వివాహితుడు. ధర్మాచరణపట్ల ఎంతో బద్ధుడైనవాడు. అతనికి ఒక వింత అలవాటు ఉండేది. అదేమిటంటే కొత్త ప్రదేశాల గురించి తెలుసుకోవడం పట్ల ఆసక్తి. ఆ  ఆసక్తి తోనే ఒకనాడు తన ఇంటికి వచ్చిన ఓ సిద్ధుడికి తగిన మర్యాదలు చేసి, భోజనం పెట్టి అతని యాత్రా విశేషాలు అడుగుతాడు. అతను ప్రపంచంలోని నలుదిక్కులు చూసి వచ్చాడని తెలుసుకుని అంత స్వల్పకాలంలో  అంతంత దూరాలు ఎలా వెళ్ళగలిగాడు అని ఆశ్చర్యపోతాడు. సిద్ధుడు ప్రవరుడి ఆసక్తిని, ఆశ్చర్యానికి ముగ్ధుడై అతని పట్ల అవ్యాజమైన ఆత్మీయతతో తన వద్ద ఉన్న పసరును ప్రవరుడి కాళ్ళకి పూసి అతను కూడా ఎక్కడికైనా వెళ్ళి రాగల శక్తిని కలిగించి తన దారిని తాను వెళ్ళిపోతాడు.ప్రవరాఖ్యుడు హిమాలయపర్వతాలు చూడాలనుకుని అక్కడికి వెంటనే చేరుకుంటాడు. ఈ కథను ఇక్కడ నాటకం ప్రారంభంలో  క్లుప్తంగా ఇలా చెప్తారు సినారె తన స్వరంతో.

ఆంధ్ర కవితా పితామహ అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్ర తెలుగు ప్రబంధాలలో మొదటిది. ఆ మహా కావ్యంలోని సుమధుర ఘట్టమే వరూధినీ ప్రవరాఖ్య వృత్తాంతం. ఎవరా వరూధిని  దివినుండి భువికి దిగివచ్చిన అప్సరో శిరోమణి. మరి ఈ ప్రవరుడు. నిత్యాగ్ని హోత్రి నిరతాన్నదాత. ఒకనాడు ఆకస్మికంగా తన ఇంటికి అతిథిగా విచ్చేసిన సిద్ధుడిని సేవించి తన తీర్థయాత్రా  వివరించాడు ప్రవరుడు. అనుగ్రహించాడు సిద్ధుడు. కాలికి పసరు పూసాడు. రివ్వున గగనానికి ఎగిరాడు ప్రవరాఖ్యుడు.  ఎన్నెన్నో తీర్ధాలను దర్శించి చివరకు చేరుకున్నాడు ఉత్తుంగ తుంగ హిమాలయ సన్నిధికి.

ప్రవరాఖ్యుడు హిమాలయాల సౌందర్యాన్ని చూసి మురిసిపోతాడు. అక్కడి పర్వతాలు, ఆకాశాన్ని అంటే శిఖరాలు, లోయలు, పచ్చని ప్రకృతి బయళ్ళు, పురివిప్పి ఆడే నెమళ్ళు, ఆ ప్రాంతంలో విహరించే జంతుజాలాలు ఇలాంటి విశేషాలెన్నో పెద్దన వర్ణించారు. వీటిలో

అటజని కాంచె భూమి సురుడంబర చుంబి శిరస్సరఝ్ఝరీ
పటల ముహుర్ముహుర్లుఠ దభంగ తరంగ మృదంగ నిశ్వన
స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్
గటక చరత్కరేణుకర కంపిత సాలము శీతశైలమున్(పెద్దనగారి పద్యం)  

అన్న ఈ ప్రముఖ మైన పద్యాన్ని తీసుకుని అందులో కొద్దిగా మార్పులు  చేసి ప్రవరుడితో ఇలా పలికించారు – సినారె.


అహో హిమవన్నగము
భరతావనికే తలమానికము
అహో హిమవన్నగము!!

అంబర చుంబి శిఖరాలు, శిరఝ్ఝరీ తరంగాలు,
ఆ అభంగ తరంగ మృదంగ రవముల
అభినయమాడు మయూరాలు   
అంటూ హిమాలయాలను ప్రశంసిస్తాడు. పెద్దనకాలం నాటికి ఉందో లేదో తెలీదు కానీ భరతావనికే తలమానికము అంటూ ఇప్పటి  మన భారతదేశానికి శిరఃభాగంలో ఉండడం వల్ల తలమానికంగా శోభిస్తోంది అనే ఔచిత్యంతో కూడిన మాటలు రాసారు సినారె. సినిమా పాటకి అనుగుణంగా పద్యంలోని " పరిఫుల్ల కలాప కలాపీ జాలమున్"  అనే పద్య పాదాన్ని  అభినయమాడె మయూరాలు అన్న ఒక్క పదంతో ఇమడ్చారు.

హిమాలయాలు భారతదేశానికి  కేవలం ఓ సరిహద్దు గిరులు మాత్రమే కాదు. పవిత్రమైన గంగానది విష్ణువు పాదలనుండి భగీరథుడి మనోరథం కోసం భువికి దిగివచ్చి తాకిన ప్రదేశం. అది మహాదేవుడు ఈశ్వరుడి   నిజ నివాసం. పార్వతీ దేవికి పుట్టిల్లు. శివపార్వతుల మధ్య   ప్రణయాగ్ని రగిల్చే ప్రయత్నం చేసి ఆ  ప్రయత్నంలో ఆ అగ్నికి మన్మథుడు తానే ఆహుతై శరీరాన్ని పోగొట్టుకున్న ప్రదేశం. ఇలా  ఎన్నో పురాణాలకు,  ఆటపట్టులు హిమాలయ సానువులు. ప్రవరుడు ఆ పర్వత సానువుల్లో చరిస్తూ ఆ విశేషాలన్నీ గుర్తుచేసుకుంటున్నాడు.

భగీరథుడు తపియించిన చోటు,
గగన గంగనే దించిన చోటు,
పరమేశుని ప్రాణేశుగ బడసి
గిరినందన తరియించిన  చోటు  అంటూ తన మాటలతో ప్రవరుడు దర్శించిన హిమాలయాలను వర్ణించారు సినారె.

ఆ గిరుల సౌందర్యాన్ని ఎంతసేపు చూసినా తనివితీరలేదు. మళ్ళీ రేపువద్దాం ఆలస్యమవుతోంది అనుకుని తిరిగి వెళ్ళే ప్రయత్నం చేసాడు.

సిద్ధుడిచ్చిన కాలి పసరుతో సిద్ధించెను  వాంఛితమ్ము
పుణ్యతీర్థ సందర్శనమ్ముతో పునీతమాయెను జీవితమ్ము

అనుకున్నాడు.  అప్పుడు తెలుసుకున్నాడు  ఆ సూర్యకాంతికి కరిగిన మంచుతో పాటుగా తన పాద లేపనం కూడా కరిగి నీరైందని. ఇక ప్రవరుడికి తిరిగి వెళ్ళే దారి కనిపించక, ఏ మార్గమూ తోచక  అల్లాడుతూ అక్కడే తిరగసాగాడు. "కాలిపసరు కరిగి పోయెనే! ఇల్లు చేరు తెరువు ఎఱుగనైతినే" అని విచారిస్తూ.


ఎక్కడి మా అరుణాస్పద పురము
ఎక్కడి ఈ హిమవన్నగ నగము
కోరి వచ్చినాను దారి కోలుపోయినాను
ఎగిరిపోదమన్ననాకు రెక్కలైన లేవే
ఏదిక్కు  కానరాదే అంటూ ఇల్లుచేరే దారి వెతుకుతూ ముందుకు సాగాడు.

అలా ఆ పర్వత గుహలదారుల్లో తిరుగుతున్న ప్రవరుడికి మధుర మంజుల వీణానాదం వినిపించింది. మనుషుల ఆవాసాల జాడ కనిపించి ఇంటికి వెళ్ళే దారి దొరుకుతుందని సరదా పడ్డాడు. అక్కడ  అద్భుతమైన సౌందర్యరాశిని ఎదురుగా చూసాడు.  తన నివాసానికి చేరకున్న ప్రవరుడిని చూసింది గంధర్వ కన్య వరూధిని. ప్రవరుడి రూపురేఖావిలాసాలను, సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యపోయింది అప్సరస- వరూధిని.

ఎక్కడివాడో యక్ష తనయేందు జయంత వసంత కంతులన్
జక్కదనంబునం గెలువఁజాలెడి వాడు మహీసురాన్వయం
బెక్కడ  యీ తనూవిభవమెక్కడ యేలనిబంటుగా మరుం
డక్కఁగొనగ రాదె యకటా నను వీడు పరిగ్రహించినన్(ఇది పెద్దనగారి పద్యం)

అంటూ "యక్షరాజైన కుబేరుడి కొడుకు నలకూబరుడు, చంద్రుడు, ఇంద్రుడి కొడుకైన జయంతుడు, వసంతుడు, మన్మధుడు ఇలా ఎంతో అందమైనవారుగా పేరుపొందిన వీరందరినీ మించిన సౌందర్యం ఈ బ్రాహ్మణుడు కలిగి ఉండడం ఏమిటి?!" అని ఆశ్చర్యపోయింది. ఇంత       గొప్ప అందగాడు నన్ను చేపట్టితే ఇక మన్మధుడు కూడా నాకు దాస్యం చేస్తాడు కదా అని అతని అందాన్ని మెచ్చుకుంది. అలా అతన్ని        చూస్తూనే ఉండిపోయింది వరూధిని.

పాపం అమాయకుడు ప్రవరుడు. తనలాగే ఆమె కూడా దారి తప్పి ఉంటుందనుకున్నాడు. మగవాడు, ధీరుడు తనకే ఇలా ఉంటే స్త్రీ కదా ఆమె ఎంత భయపడుతోందో అనుకున్నాడు.  అందుకే  తన సౌందర్యాన్ని  కళ్ళార్పకుండా చూస్తున్న వరూధినిని " ఎవ్వతెవీవు భీత హరిణేక్షణ" అంటూ  ప్రశ్నించాడు.  

ఎవ్వతెవీవు భీత హరిణేక్షణ యొంటి చరించెదోటలే
కివ్వనభూమి భూసురుడ నే బ్రవరాఖ్యుఁడఁ ద్రోవతప్పితిం
గ్రొవ్వున నిన్నగాగ్రమునకుం జనుదెంచి పురంబుఁజేర నిం
కెవ్విధిఁ గాంతుఁ దెల్పగదవే తెరువెద్ది శుభంబు నీకగున్
 (ఇది పెద్దనగారి పద్యం)

ఇలాంటి వనభూముల్లో ఒంటరిగా భయంలేకుండా తిరుగుతున్నావు ఎవరు నీవు అని అడిగాడు. తాను ప్రవరాఖ్యడనని, చెప్పాడు. అప్పటికే సిద్ధుడు ఇచ్చిన పసరు మహిమతో పుణ్యక్షేత్రాలయిన కాశీ ప్రయాగలాంటి జనసమ్మర్దం ఉన్న చోటికి వెళ్ళకుండా ఒంటరిగా ఈ హిమాలయాలకు ఎందుకు వచ్చానో అనే అపరాధ భావం పీడిస్తూ ఉంది అతనికి. అందుకే " గ్రొవ్వున నిన్నగాగ్రమునకు జనుదెంచి" అని తనని తాను తిట్టుకున్నాడు. ఇక ఇంటికి వెళ్ళే దారి ఏమిటో ఆమె చెప్పగలిగితే ఆమెకు శుభం కలుగుతుందని  బ్రాహ్మణ సహజమైన లక్షణంతో ముందుగానే దీవిస్తాడు ప్రవరుడు.

కానీ అప్పటికే ప్రవరుడి సౌందర్యం చూసి మతి పోగొట్టుకుంది వరూధిని.  ఇల్లు చేరాలనే అతని ఆత్రుతని, కంగారుని పట్టించుకోకుండా వేళా కోళం చేయడం ప్రారంభించింది.

ఇంతలు కన్నులుండ దెరువేవరి వేఁడెదు భూసురేంద్ర యే
కాంతమునందునున్న జవరాండ్ర నెపంబిడి పల్కరించులా
గింతియ కాక నీ వెఱుఁగవే మును వచ్చిన త్రోవచొప్పు నీ
కింత భయంబులేకడుగ నెల్లిదమైతిమి మాటలేటికిన్ (పెద్దనగారి పద్యం)

"ఇంత పెద్ద  పెద్ద కళ్ళు పెట్టుకుని చూస్తూ  దారి తెలియలేదంటావేం,
 ముందు నీవు నడిచి వచ్చిన దారి  ఏంటో నీకు నిజంగా తెలియదా ఏమిటి. ఒంటరిగా ఉన్న స్త్రీ కనిపిస్తే పలకరించడానికి నెపం వెతుకుతున్నావు గానీ " అంటూ నర్మగర్భంగా మాట్లాడింది.

"ఎంతమాట! ఈ ప్రవరుడట్టి వాడు కాడే"  అని ఆమె ఆరోపణలకు ఆశ్చర్యపోయాడు ప్రవరుడు. "ఆహా! అడుగకనే నీపేరు చెప్పిన ఆ తీయని నోటితో- నా పేరడగనైతివే. వరూధిని. అప్సరో శిరోమణి.  దివినుండి ఈ భువికి దిగివచ్చినాను.నీ మదన రూపమ్ము నే మెచ్చినాను –మనసిచ్చినాను "

 అంటూ సూటిగా అపర మన్మధుడి లాంటి అతని రూపం తనని ఎలా సమ్మోహన పరిచిందో వివరించి తన ప్రేమను వెల్లడించింది వరూధిని. ప్రవరుడు ఉలిక్కిపడ్డాడు. "వరూధినీ"  అంటూ ఆమెను వారించడానికి ప్రయత్నించాడు. ప్రవరుడి వారింపు ఆమెకు తొలి ప్రేమపలుకుగా తోచి వలపు మరింత రగిలించింది.


"ఆహ...ఎంత కమ్మని పిలుపు!! ఎన్ని మరులను గొలుపు" అంటూ పరవశించింది. "ఈ పూల పొదరింట చూపించు నీ వలపు"
 అంటూ అతనిని తన ప్రేమసీమకు ఆహ్వానించింది.

ప్రవరుడు ఎంతో బాధపడ్డాడు."శ్రీహరీ!! శ్రీహరీ!!  అపచారము! అపచారము!"
అని భగవన్నామ స్మరణ చేసాడు. 
"కలనైనా పరకాంతను తలచియైనా ఎరుగని వాడను. నిత్యాగ్ని హోత్రిని, నిష్టా గరిష్టుడను" అన్నాడు.అంతటి ధర్మనిష్ఠ గల తనపై వలపు తగదన్నాడు. 

వరూధిని పకపకా నవ్వింది. "ఓ అభినవ మదనా! నీ యజ్ఞయాగములు, ఈ జపతపములు- స్వర్గసౌఖ్యములు పొందుటకే కదా. ఆ సౌఖ్యమేదో నీముందు నాయందు లభింపనుండగా ఆలసింతువేల? అనుభవించ రావేలా!"
 అంటూ మంచి లాజిక్ ఉన్న ప్రశ్న వేసింది. మరణించాక దొరికే ఆ స్వర్గసౌఖ్యాలన్నీ జీవించి ఉండగానే తన పొందులోనే అనుభవించవచ్చు కదా అంది.
ప్రవరుడు "శ్రీహరీ  శ్రీహరీ" అని ఆమెనుంచి దూరంగా తప్పుకోవడానికి ప్రయత్నించాడు.

"ఓ సుందరా!!నేనోపలేనురా – ఈ మరుని తొందరా"అంటూ విరహంతో ఆపసోపాలు పడసాగింది వరూధిని.
"నిట్టూర్పు సెగలతో కందెను నా అధరము
ఎదపొంగులతో సడలెను నీవీ బంధము
మేనిలోన చెలరేగెను కానరాని తాపము
ఇకనేను సైపలేను ఈ విరహ దాహము
అంటూ ప్రవరాఖ్యుడిని కౌగలించుకోవడానికి ప్రయత్నించింది. ఆమెకు దూరంగా తప్పుకోవడానికి ప్రవరాఖ్యుడు ప్రయత్నించడంతో ఆమె నేలమీద పడిపోయింది. అలా పడడానికి కారణం తన తొందరపాటే అని వరూధినికి తెలిసినా ప్రవరాఖ్యుడిని చూపిస్తూ-

పాటునకింతులోర్తురే కృపా రహితాత్మక నీవు త్రోవ
ఇచ్చోట ఇచ్చోట ఇచ్చోట భవన్నఖాంకురము సోకె .....
కనుంగొనుము  అకట! 
వనిత తనంతట తాను వలచి వచ్చిన చుల్కన గాదె ఏరికిన్!!

 అంటూ తనమీద జాలి కలిగేలా జాలి జాలిగా ఏడ్చింది వరూధిని. ఇక్కడ ఎంతో ప్రసిద్ధిగాంచిన పెద్దనగారి పద్యంలోని మొదటి రెండు పాదాలు మాత్రం తీసుకున్నారు. వరూధిని ఎలా ఏడ్చిందో చెప్పే ఆ పాదాలకు బదులుగా సంభాషణకి అనుగుణమైన వాక్యాలు చేర్చారు సినారె.  ఆ పద్యంలో  నీ గోళ్ళు గుచ్చుకున్నాయి ఇక్కడ అంటూ ప్రవరుడికి వరూధిని     ఇచ్చోట అని ఒకసారి చూపిస్తే  సినారె గారి వరూధిని ఓ మూడు సార్లు ఇచ్చోట ఇచ్చోట ఇచ్చోట అంటూ చూపిస్తుంది. నాటకం కాబట్టి పాత్రకి జీవం పోసాయి ఈ మూడుసార్లు పలికిన మాటలు.

  
పెద్దన ముందు పద్యాలలో అన్న మాటలని ఇక్కడ కలిపి, అకట వనిత తనంతటతాను వలచి వస్తే  ఎవరికైనా చులకనే కదా అని ఇక్కడే వరూధినితో అనిపించారు.

ఇల్లు చేరే దారి చెబుతుందేమో అని ఆశగా ఆమె వద్దకి చేరిన ప్రవరాఖ్యుడికి అర్థమైపోయింది. ఇక ఆమె నుంచి తనకు ఏసహాయము రాదని. అందుకే ఆమె కల్లబొల్లి ఏడ్పులను వినిపించుకోలేదు. నిత్యం తాను ఆరాధించే దైవం, త్రికాలాలలోను తాను ఆహవం చేసే అగ్నికి అధిపతి అగ్ని దేవుడిని ప్రార్థించాడు.

దాన జపాగ్ని హోత్ర పరతంత్రుడనేని భవత్పదాంబుజ
ధ్యానరతుండ నేనిఁ పరదార ధనాదుల గోరనేని స
న్మానము తోడ నన్ను సదనంబున నిల్పు మినుండు పశ్చిమాం
భోనిధిలోన గ్రుంగకయ మున్న రయంబున హవ్య వాహనా
(ఇది పెద్దనగారి పద్యం)

అంటూ సాయంత్రం లోపల తనను ఇల్లు చేర్చమని ప్రార్థించాడు. అతని విన్నపాన్ని మన్నించి అగ్ని దేవుడు అతనిని అరుణాస్పద పురంలోని  నివాసానికి చేర్చాడు.ఇక్కడితో ప్రవరాఖ్యుడి కథ అయిపోయింది నిజానికి.
కానీ కాదు. అసలు కథ ఇంకా ఇప్పుడే మొదలైంది వరూధినికి.

"ఏనాటినుండో వరూధినిపై మక్కువ పడ్డ గంధర్వుడు( అతని పేరు కలి) ఈ అవకాశాన్ని  పురస్కరించుకుని  ప్రవరుడి రూపం దాల్చి వరూధిని వద్దకు వచ్చాడు. 
ఆ మాయా ప్రవరుని తిలకించి పులకాంకిత యైన వరూధిని "


"నీవేనా స్వామీ నీవేనా
ఇది నిజమేనా మరి కలలోనా "
అనుకుంటూ  మైకంలోంచి లేచింది వరూధిని.

"ఏలరా ఈ చలమేలరా, ఏలరా ఇక  నన్నేలరా
పాల వెన్నెల నురుగుల చెరసాలలో- మాలతీ లతా నికుంజాలలో
ఏలరా ఇకనైనా ఏలరా"
అంటూ ప్రవరుడిని బ్రతిమాలడం ప్రారంభించింది.
ఏలరా ఈ చలమేలరా  అనే ఈ వాక్యాలు మనకు జావళీగీతాలలో తరచు కనిపిస్తాయి. (చలము అంటే ఆలస్యం). ఇక్కడ సినారె ఏలరా అంటే ఎందుకురా అని ఒక అర్థంలో ఒకసారి, ఏలరా అంటే తనను ఏలుకోమని మరో అర్థంలోను చక్కగా వాడారు.

వరూధినిని కోరి వచ్చాడు మాయా ప్రవరుడు. అయినా వెంటనే వప్పుకుంటే తన సంగతి తెలుస్తుందేమో నని అనుమానించాడు కాబోలు. బెట్టు సాగించాడు ఆ మాయా ప్రవరుడు.

"నీ వెక్కడా  నేనెక్కడా
 భువి ఎక్కడా దివి ఎక్కడా
ఆ నింగికి ఈ నేలకు ముడి పడే దెట్టులా"
 అంటూ తనకి ఆమెకి ఉన్న అంతరాలను వివరించడానికి ప్రయత్నించాడు. 

"నీ కనులు కనికరించితే మనసు సమ్మతించితే
దివిని మరచి భువినే తలచేనురా
ఈ భువినే ఆ దివిగా తలచేనురా "
అంటూ తను ఈ భూలోకాన్నే తన స్వర్గలోకంగా ఊహించుకుని అతనితో గడపగలనని చెప్తుంది వరూధిని. అతని పై ఆమెకు గల ప్రేమకు నిదర్శనం ఈ మాటలు.

"గాలి తాకిడికే కందే నీ చెక్కిళ్ళూ
పూల తొక్కిడికే  బొబ్బలెక్కే అరికాళ్ళూ
ఇంతటి సుమకోమలివే అంతటి స్వర్గాలు వీడి
ఎటుల నిలువ గలవూ ఈ లోకంలో నరలోకంలో!!

అంటూ వరూధిని సౌందర్యాన్ని ప్రశంసిస్తాడు మాయా ప్రవరుడు. ప్రవరుడు దారికొస్తున్న సూచనలు కనిపించాయి వరూధినికి. మళ్ళీ మనసు మార్చుకొని వెళ్ళిపోతాడేమోనని భయపడింది. అందుకే

"నేను నీ దాననైనా చాలురా!!
 నీవు నావాడవైతే పదివేలురా !!

అంటూ అతడిని చేరింది. నీదాననైనా చాలురా అంటే ఇక్కడ వరూధిని ప్రవరుడికి తనని తాను సమర్పించుకుంటోందన్నమాట. నీవు నావాడవైతే పదివేలురా అంటే ప్రవరుడు కూడా పూర్తిగా వరూధిని పట్ల అనురక్తిని పెంచుకుని ఆమెకు తన మనస్ఫూర్తిగా తనని సమర్పించుకోవడం అన్నమాట. ఈ మాటలు చాలా చమత్కారంగా అనిపించారు వరూధినితో సినారె. ఆమెకు ప్రవరుడి పట్ల కలిగిన అనురాగాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తాయి ఈ మాటలు.

"నీ పద ధూళిని నిలిచిన నాడు 
నరకమైన అది నందనవనమేరా"
 అంటూ ఆ మాయాప్రవరుడిని తను ప్రేమించిన ప్రవరాఖ్యుడిగానే ఊహించి అతనికి తన జీవితాన్ని కానుకగా సమర్పించుకుంటుంది.

భిన్న లోకాలలో జీవిస్తున్న, భిన్న ప్రవృత్తులు కలిగి ఉన్న ఈ వరూధినీ ప్రవరాఖ్యుల ఇతివృత్తం మనుచరిత్రలోమను సంభవానికి కారణమైంది. వరూధిని గర్భం దాల్చగానే,  ఒకరోజు - తనకు పసరు రాసిన సిద్ధుడు కనిపించాడని, తనకోసం అందరూ ఎదురుచూస్తున్నారని, చూసి వస్తానని, అప్పుడప్పుడూ వస్తూ ఉంటానని చెప్పి మాయా ప్రవరుడు – ప్రవరాఖ్యుడిగానే నటించి వరూధిని నుంచి దూరమయ్యాడు. వరూధినికి ఎప్పటికీ అతను మాయారూపుడని తెలియనే తెలియదు. అప్సరస కావడం వలన నచ్చినవాడిని కోరుకోవడం ఆమెకు ధర్మమే. ఏకపత్నీ వ్రతం, సదాచారం,వైరాగ్యం ప్రవరుడి ధర్మం. అలాంటి ప్రవరుడిలోని అతిలోకసౌందర్యాన్ని చూసి మోహించి అతనినే  ఊహిస్తూ ఆమె జీవించడం వలన అతని ధర్మతేజపు  అంశ  స్వరోచి కుమారుడు మనువుగా రూపెత్తింది.

భక్తి వైరాగ్య సంపన్నుడిగా, విష్ణువును సాక్షాత్కరింపజేసుకున్న గొప్పభక్తుడిగా, సకల భువన రక్షాదక్షుడిగా, ధర్మ స్వరూపుడుగా మనువు గౌరవాలందాడు. మానవలోకంలోనే ఉన్నా మానవాతీతులుగా కనిపించే మనువులకు మూల పురుషుడు స్వారోచిష మనువు. ఈ మనుసంభవమే మనుచరిత్ర. ఆ సంభవానికి పూర్వగాథే ఈ వరూధినీ ప్రవరాఖ్య వృత్తాంతం.

రసాభాస కావలసిన గాథని, రసవత్తరమైన కథాంశంగా తీర్చిదిద్దిన పెద్దనగారి ఈ వృత్తాంతాన్ని ఇతివృత్తంగా తీసుకుని ఓ సాంఘిక చిత్రం కోసం అందమైన నృత్య నాటకంగా సరస సంభాషణలతో రసవత్తరంగా  తీర్చిదిద్దిన మన            సినారె – భళారే.

పాట రచన   సి. నారాయణరెడ్డి.

గానం          ఘంటసాల, సుశీల, ఎన్ .టి. రామారావు, వాణిశ్రీ,   
      ఈ అంతర్నాటకం రచన శ్రీ డా.        సి.నారాయణరెడ్డి.
  ఏ.పుండరీకాక్షయ్య నిర్మించిన ఈ చిత్రానికి దర్శకులు బి.వి. ప్రసాద్.